శీతకాల విడిది కోసం నేడు తెలంగాణ‌కు రాష్ట్రపతి.. బొల్లారంలో ప్రత్యేక ఏర్పాట్లు


శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. నేటి నుంచి 30 వరకు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నియలంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని శత్రు దుర్భేధ్యంగా తీర్చి దిద్దారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలోని 6 భవనాలు, వెలుపల ఉన్న 14 భవనాలను, చుట్టూ ఉన్న ప్రాంతాలను , ఉద్యాన వనాలను అందంగా తీర్చిదిద్దారు. తాగునీటి సదుపాయాన్ని మెరుగుపరచారు. అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు.


పాములు, ఇతర విష కీటకాలు ప్రవేశించకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించడంతోపాటు అనేక చర్యలు చేపట్టారు. ఢిల్లి నుంచి వచ్చిన ప్రత్యేక బృదం ఇప్పటికే బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని , పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. భద్రతా చర్యల్లో భాగంగా రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేక ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేశారు. బొల్లారం-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక బందబోస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు జారీ చేశారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.


 రాష్ట్రపతి విడిది నేపథ్యంలో హకీంపేట ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ – సికింద్రాబాద్‌- రాష్ట్రపతి నిలయం- రాజ్‌భవన్‌ మార్గాల్లో ఇప్పటికే రూట్‌ కాన్వాయ్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 28న రాష్ట్రపతి భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఏర్పాట్లను ఆదివారం పర్యవేక్షించారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ గెస్ట్‌ హౌజ్‌లో రాష్ట్రపతి విశ్రాంతికి ఏర్పాట్లు చేశారు. సారపాక నుంచి భద్రాచలం వరకు వచ్చే రహదారి ప్రాంతంతోపాటు భద్రాద్రి ఆలయంలో ప్రతి భాగాన్ని పర్యవేక్షించారు.


రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. కాగా.. యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో యాదాద్రిలోనూ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కొండ కింద యాగస్థలంలో హెలిప్యాడ్‌ ప్రాంగణాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి, తనిఖీలు నిర్వహిస్తున్నారు.


రాష్ట్రపతి షెడ్యూల్ ఈవిధంగా ఉంది
26-12-2022
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రసాద్ పథకం కింద ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4:15 నిమిషాలకు హాకీంపేట విమానాశ్రయం చేరుకుంటారు. హకీంపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళరాజన్ రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. బొల్లారంలోని అమరవీరుల స్మారక సుఖం వద్ద అమర జవాన్ లకు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. సాయంత్రం ఏడు గంటల 45 నిమిషాలకు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై  ఇచ్చే విందులో పాల్గొంటారు.


27-12-2022
 27 ఉదయం 10 గంటలకు నారాయణగూడ లోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల స్టూడెంట్స్, టీచర్లలతో ముఖాముఖిలో పాల్గొంటారు. సాయంత్రం మూడు గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 74వ బ్యాచ్ ట్రైనింగ్ ఐపీఎస్ అధికారులతో ముఖాముఖి హాజరవుతారు. ఆ తర్వాత కంచన్ భాగ్ లోని మిథానికి వెళ్లి వైడ్ ఫ్లైట్ మిల్లును ప్రారంభిస్తారు.


28-12-2022
28 ఉదయం హాకీపేట నుంచి విమానంలో రాజమండ్రి వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో భద్రాచలం వెళ్తారు. భద్రాచలం ఆలయాన్ని సందర్శించి ప్రసాద్ పథకం కింద అమల్లో ఆలయంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే వనవాసి కళ్యాణ పరిషత్ - తెలంగాణ ఏర్పాటు చేసే సమ్మక్క సారలమ్మ జనజాతి పూజారి సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు. అక్కడినుంచి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెందిన ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలను భద్రాచలం నుంచి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాలకు ములుగు చేరుకుంటారు. ములుగులోని రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయ పునరుద్ధరణకు శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు.


29-12-2022
29 ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని జి నారాయణమ్మ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.  సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ లో సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు.


30-12-2022
30 ఉదయం తొమ్మిది గంటల 30 నిమిషాలకు హెలికాప్టర్లో యాదాద్రి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి నిలయానికి తిరిగి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటుచేసే విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా వీరనారీలను సత్కరిస్తారు.


నేడు కోర్టుకు నవీన్‌ రెడ్డి.  వైశాలి అపహరణ కేసులో నిందితుడికి నేటితో కస్టడీ పూర్తి


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మన్నెగూడ దంత వైద్యురాలు వైశాలి అపహరణ కేసులో ప్రధాన నిందితుడు కొడుదుల నవీన్‌రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు విధించిన 3రోజుల కస్టడీ నేటితో పూర్తికానుంది. విచారణ నిమిత్తం నవీన్‌ను 5రోజుల పాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా ఆదిభట్ల పోలీసులు ఈ నెల 15న రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 16న కేసు విచారణకు రాగా.. కేసు రీకన్‌స్ట్రక్షన్‌ నిమిత్తం నిందితుడిని 5రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వాదోపవాదాల అనంతరం జిల్లా కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో పోలీసులు శనివారం నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిభట్ల స్టేషన్‌కు తరలించి విచారణ నిర్వహిస్తున్నారు. రెండవ రోజైన ఆదివారం కేసు రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు.నేడు అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.


హైకోర్టులో రిట్‌ వేస్తానంటున్న పైలట్ రోహిత్ రెడ్డి


ఒకవైపు సిట్‌.. మరోవైపు ఈడీ ఎంట్రీతో ట్విస్ట్‌లు.. ఫామ్‌హౌస్‌ కేసులో ఏ2 నందకుమార్‌ను నేడు ప్రశ్నించనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. 


దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇవాళ కీలక పరిణామం జరగబోతోంది. A2 నందకుమార్‌ను ఈరోజు ప్రశ్నించబోతోంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. చంచల్‌గూడ జైల్లో నందు స్టేట్‌మెంట్‌ తీసుకోంది ఈడీ. అయితే, నందకుమార్‌ను ఈడీ ఏం అడగబోతోంది?. ఎలాంటి ప్రశ్నలను నందు ముందుంచబోతోంది?. ఈడీ ప్రశ్నలకు నందకుమార్‌ ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. నందు స్టేట్‌మెంట్‌ రికార్డుకు ఈడీ రెడీ అయిన వేళ, సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. ఫామ్‌హౌస్‌ కేసులో ఈడీ ఎంట్రీపైనే డౌట్స్‌ రెయిజ్‌ చేస్తున్నారు. అసలు, ఈడీ విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. స్పాట్‌లో ఎలాంటి డబ్బు దొరకనప్పుడు ఈడీ ఎంట్రీ ఎందుకన్నది రోహిత్‌రెడ్డి వాదన. ఇదంతా తనను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ చేయిస్తున్న కుట్ర అంటున్నారు రోహిత్‌రెడ్డి.



దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్టుగా ఫామ్‌హౌస్‌ కేసులో తననే దోషిగా చూపించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశారంటున్నారు రోహిత్‌రెడ్డి. అయితే, ఎన్ని కొత్త కుట్రలు చేసినా, ఎన్ని మాస్టర్ ప్లాన్‌ వేసినా తగ్గేదేలే అంటున్నారు. రోహిత్‌ కామెంట్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చింది బీజేపీ. ఈడీ తన పని తాను చేస్తుంటే ఎందుకంత ఉలికిపాటు అంటూ సెటైర్లు వేశారు రామచంద్రరావు. ఫామ్‌హౌస్‌లో అసలేం జరిగింది..?ఎవరు ఎవర్ని సంప్రదించారు? అనే సమాచారాన్ని నందకుమార్‌ నుంచి తీసుకోనుంది ఈడీ. నందు స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆ తర్వాత రోహిత్‌రెడ్డిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు కలవరం పుట్టిస్తోంది.


ఇదంతా తనను ఇరికించేందుకు జరుగుతోన్న కుట్ర అంటోన్న రోహిత్‌రెడ్డి, హైకోర్టులో రిట్‌ వేయబోతున్నారు. అసలు, నందు ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వనున్నాడు?. రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుంది?. రేపు మళ్లీ ఈడీ విచారణకు రోహిత్‌ను ఈడీ ఏం అడగనుంది? ఇవన్నీ ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి.


నేడు సిరిసిల్ల సెస్ ఎన్నికల ఫలితాలు


సిరిసిల్ల సెస్ ఎన్నికల రిజల్ట్ నేడే రానుంది. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు గాను 87130 ఓట్లు ఉండగా 73, 180 పోలయ్యాయి. వేములవాడ గవర్నమెంట్ కాలేజీలో జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ తర్వాత ఎన్నికైన అభ్యర్థులను ప్రకటించనున్నారు మొత్తం 76 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటుండగా పూర్తి నిఘా తో బాటు పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న లెక్కింపు ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం వరకు ఫైనల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది.


హైదరాబాద్‌ శివారులో పెరిగిన చలి


రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 10.1 డిగ్రీలు, హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఇంతకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. నగర శివారు ప్రాంతాల్లో గత మూడు రోజుల క్రితంతో పోల్చితే రాత్రిపూట ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీలు తగ్గడంతో చలి పెరిగినట్లయింది. ఆగ్నేయ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో మధ్యాహ్నం పొడి, రాత్రిపూట చలి వాతావరణం ఉంటుందని తెలిపింది. నిన్న మధ్యాహ్నం ఖమ్మం జిల్లా గుబ్బగుర్తి గ్రామంలో 2.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


నేడు పాలకుర్తి లో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించనున్న మంత్రి ఎర్రబెల్లి


నేడు ఉదయం 10 గంటలకు పాలకుర్తిలో డిఆర్డిఏ ద్వారా మహిళలకు కుట్టు మిషన్లపై  శిక్షణను ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా మంత్రి శ్రీ దయాకర్ రావు .


కాజీపేట రైల్వే కోచ్ ప్యాక్టరీ పై నేడు బీఆర్ఎస్ ఆందోళన


ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్  నేడు ఉదయం 10:00 గంటలకు కాజీపేట జంక్షన్ లో  కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన  నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు