Kishan Reddy :    ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుందని..  జూన్ 2వ తేదీ ఉదయం గం. 7.00కు జాతీయ పతాక ఆవిష్కరణతో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభిస్తామని ఢిల్లీలో తెలిపారు. జూన్ 3న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం గురించి కార్యక్రమాలను ప్రదర్శిస్తాం.. ఖిలా ఔర్ కహానీ' పేరుతో పాఠశాల విద్యార్థులకు ఫొటో - పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.  

ఇతర రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు 

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను వివిధ రాష్ట్రాల్లోనూ నిర్వహించేలా కేంద్రం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలిపారు.  ఆయా రాష్ట్రాల్లో నివసించే తెలంగాణ ప్రజలను రాజ్‌భవన్లకు ఆహ్వానించి, గవర్నర్ల ఆధ్వర్యంలో జరిపేలా ఏర్పాట్లు చేశామన్నారు.  'ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్' స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలను అన్ని చోట్లా జరుపుకునేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఢిల్లీలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో జరుగుతాయని..  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లక్షలాది తెలంగాణ ప్రజలు, కుటుంబాలు భాగస్వాములయ్యాయని గుర్తు చేశారు. తా ము పాల్గొనని పోరాటం అంటూ ఏదీ లేదన్నారు.  పార్లమెంటులో సుష్మా స్వరాజ్ నేతృత్వంలో బీజేపీ 160 మంది ఎంపీలు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కీలక పాత్ర పోషించామని గుర్తు చేశారు. 

బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు ! 

బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని బీఆర్ఎస్ నేత కే. కేశవరావు ఓ సందర్భంగా చెప్పారని..   బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం. ఇతర రాజకీయ పార్టీల కంటే ముందే కాకినాడలో తీర్మానం చేశామన్నారు.  తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం అందజేసిన సహాయం, ఇచ్చిన నిధులు, పథకాలు, ప్రాజెక్టులు సహా ఒక సమగ్ర నివేదికను తెలంగాణ ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు.  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం సామరస్యంగా చర్చలు జరుపుకోవాలని సూచిస్తున్నామన్నారు.  ఢిల్లీలోని ఉమ్మడి భవన్ విభజన కోసం తాజాగా ఓ సమావేశం జరిగింది.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొత్త పార్లమెంట్ భవనం నిర్మించామని..  నియోజకవర్గాల పునర్విభజనపై మేమేమీ కొత్త చట్టం చేయలేదని గుర్తు చేశారు.  ఇప్పటికే అమలవుతున్న చట్టం ప్రకారమే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్నారు. 

బీజేపీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం లేదు ! 

దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల మధ్య సంత్సంబంధాలు నెలకొల్పేందుకు కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తోందని  కిషన్ రెడ్డితెలిపారు.  జాతీయ భావజాలంతో పనిచేసే ప్రభుత్వం..  ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా సరే దేశం మొత్తం మాదే అనుకునే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు.  బీజేపీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని..  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీజేపీ మీద ఈ రకంగా కుట్రలు చేస్తున్నాయన్నారు.  కల్వకుంట్ల కుటుంబం ఓట్లు చీలడం కోసం కాంగ్రెస్‌ కూడా బలంగా ఉండాలన్న ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తోంది. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన పోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.  బీజేపీలో చేరిన నేతలందరూ బీజేపీలోనే ఉన్నారు. ఉంటారు. ఇంకా అనేకమంది నేతలు చేరబోతున్నారు. పార్టీ గెలవాలంటే ప్రజల ఆశీస్సులు, నాయకత్వం కూడా అవసరమేనన్నారు.