Sajjanar Shares Viral Video Of youth on Rail Tracks | హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు యువత చేసే పిచ్చి పనులు వారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తున్నాం. అయినా అలాంటి వారు ఏమాత్రం రియలైజ్ కావడం లేదు. రీల్స్ వ్యూస్, లైక్స్ కోసం రైలు పట్టాలపై పిచ్చి పనులు చేస్తూ ఆ తతంగాన్ని వీడియో తీసి సైతం సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి కేసుల్లో ఇరుక్కుంటున్నారు.

తాజాగా అలాంటి ఘటన మరొకటి జరిగింది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకుని వీడియో తీసుకున్నాడు. అది కూడా రైలు వెళ్తుంటే పట్టాలపై పడుకుని ఆ యువకుడు వీడియో తీశాడు. రీల్స్, షార్ట్స్ వ్యూస్, లైక్స్  కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేయడంపై టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైలు పట్టాలపై పడుకుని మొబైల్ లో వీడియో తీసిన యువకుడి పిచ్చి చేష్టలపై మండిపడ్డారు.

మానసిక రోగులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి‘రీల్స్ చేసి ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలనే కొందరు యువత తాపత్రయపడుతున్నారు. కానీ.. ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయడం లేదు. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే వారి తల్లితండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తారనే సోయి కూడా వారికి ఉంటలేదు. సోషల్ మీడియా వ్యూస్, లైక్స్ మత్తులో పడిన ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ ఇవ్వడం అత్యవసరం. లేకుంటే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయని.. ఇంకా మరెన్నో వెర్రి పనులు చేసి వీడియోలు తీసుకునే ఆస్కారం ఉంది’ అని ఐపీఎస్ సజ్జనార్ అభిప్రాయపడ్డారు.