AP Weather Updates: అసని తుఫాన్ ప్రభావం తగ్గడంతో ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మండిపోతున్నాయి. పగటి వేళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 దాటాయి. మరికొన్ని రోజుల్లో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. వాతావరణ శాఖ కొన్నిచోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.


ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం పొడిగా మారింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా నమోదైంది. ఉక్కపోత, తేమ అధికం కావడంతో ప్రజలు ఎండ వేడమిని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోనూ ఒకట్రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అమరావతిలో 38 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 39 డిగ్రీలు, గన్నవరంలో 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని సూచించారు. నేటి నుంచి ఇక్కడ ఎండలు మండిపోతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొది. అనంతపురంలో పగటి ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు దాటిపోయింది. కర్నూలులో 39.3 డిగ్రీలు, నంద్యాలలో 38.2 డిగ్రీలు, కడపలో 38 డిగ్రీల మేర నమోదైందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.


తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. ( Temperature in Telangana)
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత అధికం కానున్నాయి. కొన్ని చోట్ల 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. కొన్ని జిల్లాల్లో 41 నుంచి 45 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీమ్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో 41 నుంచి 45 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించారు.