BC Survey In Telangana: బీసీల్లో వివిధ కులాల రాజకీయ ప్రాతినిధ్యంపై త్వరలో సర్వే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ఆధారంగా ప్రభుత్వం గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఇప్పటికే ఓబీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో బీసీలకు నిర్ణీత రిజర్వేషన్లు లేవు. జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పొడిగించిన తర్వాత బీసీలకు 20% కోటా లభిస్తుంది. 


అక్టోబర్‌లో అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల సహకారంతో సర్వే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా సెప్టెంబరు 25 నుంచి నాలుగు రోజుల పాటు పంచాయితీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలతో కీలక సమావేశం జరగనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరిస్తారు. ఈ వివరాలతో కూడిన డేటాను విశ్లేషించడానికి రాష్ట్ర ప్రభుత్వం కోసం తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (TSTS) ఒక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది. 


సర్వేలో గ్రామం, మున్సిపల్ డివిజన్, వార్డులో బీసీ జనాభా, బీసీ ఓటర్ల శాతం, విద్యార్హతలు, బీసీల ప్రాతినిధ్యం, వారి ఆర్థిక స్థితి వంటి విభిన్న ప్రశ్నలను సర్వే సిబ్బంది అడుగుతారని అధికారిక వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లను నిర్ణయించే పనిలో బీసీ కమిషన్ ప్రస్తుతం నిమగ్నమైనట్లు కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ట్రిపుల్ టెస్ట్, కఠినమైన, అనుభవపూర్వక విచారణ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. 


స్థానిక సంస్థల్లో నిర్ణీత బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్రాలు ట్రిపుల్ పరీక్షను పాటించాల్సి ఉంటుందని కృష్ణమోహన్ రావు చెప్పారు. ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాలు ట్రిపుల్ పరీక్షను పాటించడంలో విఫలమయ్యాయని, బీసీ రిజర్వేషన్లను అమలు చేయలేకపోయాయని అన్నారు. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ ట్రిపుల్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాయని ఆయన చెప్పారు. 


రిజర్వేషన్ల విషయంలో బీహార్‌లో చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యాయని, అలాంటివి జరగకుండా సర్వే చేపట్టాడానికి ముందు కమిషన్ తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలను సందర్శించి అక్కడి పరిస్థితులను, అనుసరించిన పద్దతులను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలనే దానిపై నిర్దిష్టమైన సిఫార్సులతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.


రిజర్వేషన్లకు బీసీల పట్టు
స్థానిక ఎన్నికల్లో సైతం బీసీలకు పెద్ద పీట వేయాలని ఆ సామజికవర్గ నేతలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. తక్కువ శాతం ఉన్న అగ్రకులాలు రాజ్యాధికారం దక్కించుకుని ఇతరులకు తీరని అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీలను అన్ని పార్టీలు జెండాలు మోసే వ్యక్తులుగా, రాజకీయాలకు పావులుగా వాడుకుంటున్నాయే తప్ప అధికారం ఇవ్వడం లేదని, కులగణన చేపట్టి బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. జనాభా లెక్కలతోనే రిజర్వేషన్లు దక్కుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.