తెలంగాణలో విగ్రహ రాజకీయాలు.. తెలంగాణ లో ప్రస్తుతం విగ్రహాల చుట్టూ రాజకీయాలు  తిరుగుతున్నాయి.  తెలంగాణ తల్లి  విగ్రహంలో మార్పులు  చేసి  సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి  ప్రతిష్టంచేందుకు ఏర్పాట్లు చేయడం ఇందుకు కారణం.  తెలంగాణ ఉద్యమంలో  తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం లో రాచరిక పోకడలు ఉన్నాయని,  అలాంటి విగ్రహం  తెలంగాణ  తల్లిగా  గుర్తించడం సరి కాదన్నది కాంగ్రెస్ వాదన.   ఆ విగ్రహానికి భిన్నంగా  మరో విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. దాన్ని అధికారికంగా రాష్ట్ర సచివాలయంలో  ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే  కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన విగ్రం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును  ప్రతిబింబించేలా చేసింది తప్ప తెలంగాణ తల్లి విగ్రహం కాదని ఇది కాంగ్రెస్ తల్లి విగ్రహమన్నది బీఆర్ఎస్ నేతల   ఆరోపణ. ఇలా విగ్రహాల చుట్టూ తెలంగాణ రాజకీయం  తిరుగుతోంది.

విగ్రహ రాజకీయాలేందుకంటే

మన దేశంలో విగ్రహ రాజకీయాలు అనేది మత, కుల, ప్రాంతీయ, సాంఘీక , రాజకీయ థృక్పధాన్ని వెళ్లడి చేసేందుకు ప్రతీకలుగా  గుర్తించవచ్చు.  విగ్రహం అనేది అది ఏర్పాటు చేసిన మత , కుల, ప్రాంతం, రాజకీయ పార్టీ ల  లేదా సంఘ సంస్కర్తల  ఉద్భోదనలను గుర్తు చేసేందుకు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి వాటిని తమకు అనుకూలంగా రాజకీయ పార్టీలు  ఓట్ల కోసం వాడుకుంటూ ఉంటాయి.  అందుకే విగ్రహ ఏర్పాటు నుండి విగ్రహ ధ్వంసాల వరకు  ఈ రాజకీయాలు ప్రస్తుతం దేశంలో  నడుస్తున్నాయి.  దేశ వ్యాప్తంగా అత్యధిక విగ్రహాలు ఎవరివిఅని చూస్తే డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మ గాంధీ, ఫూలే, నేతాజీ సుభాష్ చంద్రబోద్, భగత్ సింగ్ వంటి వారివి. ఆ తర్వాత  నుంచి  పార్టీ నేతల విగ్రహాలు  జవహర్ లాల్ నెహ్రూ,  ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ,  కాన్షీరాం,  ఎంజీఆర్, అన్నాదురై జయలలిత, ఎన్టీఆర్,  వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి నేతల  విగ్రహాలు దేశ వ్యాప్తంగా కొలువు తీరాయి.   ఇలా  దేశంలో పెద్ద ఎత్తున  విగ్రహ రాజకీయాలు మొదలయ్యాయి.  ఈ విగ్రహాల ద్వారా తమ పార్టీ భావజాలాన్ని తీసుకువెళ్లడమే ప్రధాన ఉద్దేశం. చివరకు ఇవన్నీ ఓట్ బ్యాంకు రాజకీయాల కోసమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. 

తెలంగాణలో..

తెలంగాణ ఉద్యమంలోను  విగ్రహా రాజకీయం చోటు చేసుకుంది. తెలంగామ ఉద్యమం తీవ్రతరం అయ్యాక ట్యాంక్ బండ్ పై కొలువు తీరిన ఆంధ్రా ప్రాంత వైతాళికుల విగ్రహాలపై  మిలియన్ మార్చ్ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారులు కొందరు  ధ్వంసం చేయడం జరిగింది.  ఆ సమయంలో ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహంపైన దాడి జరిగింది.  తెలంగాణలో ఆంధ్ర ప్రాంత వైతాళికుల విగ్రహాలకు స్థానం ఇచ్చారే తప్ప తెలంగాణ ప్రాంత నేతలను గుర్తించడంలో అన్యాయం జరిగిందని ఉద్యమ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి.

అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ అయితే ఒక అడుగు ముందుకేసి తెలంగాణ వస్తే ట్యాంక్ బండ్ పై విగ్రహాలు ఏపీకి పంపుతామని, తెలంగాణ వైతాళికుల విగ్రహాలు పెడతామని ప్రకటన చేశారు.  అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆంధ్ర ప్రాంత విగ్రహాల జోలికి వెళ్లలేదు  అది వేరే విషయం.  అంతే కాకుండా అసెంబ్లీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్న డిమాండ్ ను అప్పటి టీఆర్ఎస్ నేతలు  ప్రారంభించారు. చివరకు అసెంబ్లీలో  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అప్పటికే ఉన్న గాంధీ విగ్రహం పక్కన పెట్టడం జరిగింది.  ఆ తర్వాత తెలంగాణ వచ్చాక  సీఎంగా కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టాక 2016లో  హుస్సెన్ సాగర్ వద్ద 11.8 ఎకరాల్లో  125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. 

తెలంగాణ తల్లి విగ్రహా విషయానికి వస్తే

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగు తల్లికి పోటీగా ఉద్యమ కారులు తెలంగాణ తల్లి భావన తీసుకువచ్చారు.   కేసీఆర్ సహా ఉద్యమ నేతలు  తెలంగాణ తల్లి విగ్రహ భావజాలాన్ని తెలుగు తల్లికి పోటీగా తీసుకువచ్చి తెలంగాణ వ్యాప్తంగా  ఈ విగ్రహాల ప్రతిష్టాపన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు మా తెలుగు తల్లికి  మల్లెపూదండ అనే పాటకు పోటీగా  జయ జయహే తెలంగాణ అనే గీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ప్రతీ  ఉద్యమ కార్యక్రమానికి ముందు తెలంగాణ తల్లికి అంజలి ఘటించడం, జయ జయహే తెలంగాణ పాట ఆలపించడం  ఉద్యమంలో భాగమైంది. ఇలా తెలంగాణ తల్లి విగ్రహాం తెలంగాణ ఉద్యమంలో  కీలక పాత్ర పోషించింది. 

కాంగ్రెస్ ‍ బీఆర్ఎస్ ల మధ్య విగ్రహ వేడి...పదేళ్ల పాలన తర్వాత  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి  తెలంగాణ తల్లి విగ్రహంలోను, ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మార్పులు తేవాలని నిర్ణయించారు.  అందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహంలో కొన్ని మార్పులు చేసి సచివాలయంలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు.  దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  ఉద్యమంలో ప్రాచుర్యం పొందిన తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా చేయి గుర్తుతో ఉన్న విగ్రహాన్ని పెడుతోందని  విమర్శలు చేస్తోంది. అయితే తిరిగి తాము అధికారంలోకి వస్తే మళ్లీ పాత తెలంగాణ విగ్రహాన్నే ప్రతిష్టామని చెబుతోంది. అంతే కాకుండా ఇవాళ  సచివాలయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టిస్తోన్న విగ్రహానికి పోటీగా తెలంగాణ వ్యాప్తంగా పాత తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు  అక్కడే కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అసెంబ్లీలో ఈ విగ్రహ ఏర్పాటుపై సీఎం ప్రకటన చేయడం జరిగింది. దానిపై జరిగిన చర్చలోను బీఆర్ఎస్ పాల్గొనలేదు. ఇలా తెలంగాణలోను విగ్రహ రాజకీయం ముదిరింది.  తెలంగాణ తల్లి భావన  ఇప్పుడు  రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. ఏది ఏమైనా రెండు పార్టీల మధ్య  ఈ రాజకీయ వేడి ఎలక్షన్ పాలిటిక్స్  లో భాగమే అని తెలియంది కాదు. కాకపోతే విగ్రహ ఏర్పాటు ద్వారా ఏ పార్టీకి ఎంత లబ్ధి చేకూరుతుందన్నది బ్యాలెట్ బ్యాక్స్ ద్వారానే భవిష్యత్తులో తెలుస్తుంది.