తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం(Tg Govt) నిర్ణయించింది. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ ఎంపిక చేసింది. ఈమేరకు రేవంత్‌రెడ్డి( Revanth) అధ్యక్షతన సమావేశమై తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ లో టీఎస్ ను టీజీగా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.


తెలంగాణ తల్లి రూపురేఖలు మార్పు
తెలంగాణ(Telangana) తల్లి విగ్రహం ఒక వ్యక్తిని ఊహించుకునేలా ఉందని అందుకే మార్చనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు, చేర్పులు చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను మంత్రిమండలి ఆమోదించింది. వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌ను టీజీగా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. గత పాలకులు తమ పార్టీ పేరును పోలేలా ఉండేలా టీఎస్‌పెట్టారని..మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhra Babu) మండిపడ్డారు. రాష్ట్రంలో కుల గణన చేయాలని కేబినెట్ తీర్మానించింది.


రాష్ట్రంలో బీసీ కులాల గణన చేపడతామని ఎన్నికల ముందు కాంగ్రెస్( Congress) హామీ ఇచ్చింది. ఆ మేరకు కులగణన చేపట్టాలని మంత్రివర్గం తీర్మానించింది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరుగ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై సంతృప్తి వ్యక్తం చేసింది. మరో రెండు కొత్త పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించనున్నారు. అయిదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ ను త్వరలో అమలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలోని 65 ఐటీఐ(Iti) కళాశాలలను అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రాజేంద్రనగర్‌లో హైకోర్టుకు వందెకరాలను కేటాయిస్తూ కేబినెట్( Cabinet) ఆమోదముద్ర వేసింది. ఖైదీలకు క్షమాభిక్ష కోసం అవసరమైన ప్రక్రియను చేపట్టాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు తెలంగాణ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.


జాబ్‌ల కోసం తప్పని ఎదురుచూపులు
కాంగ్రెస్( Congress) అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గ్రూప్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పడమేగాక...తేదీలతో సహా ప్రధాన దినపత్రికల్లో పెద్దపెద్ద యాడ్‌లు ఇచ్చింది. దీంతో కీలకమైన మంత్రివర్గ సమావేశంలో జాబ్‌ నోటిఫిషన్ పై నిర్ణయం తీసుకుంటాని నిరుద్యోగులు ఎదురుచూసినా....ప్రభుత్వం నుంచి అలాంటి నిర్ణయమేమీ రాలేదు. ఇటీవలే ఛైర్మన్, బోర్డు సభ్యులు నియామకం చేపట్టడంతో ఆచీతూచీ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు నోటిఫికేషన్ విడుదల చేసి అభాసుపాలైన నేపథ్యంలో కొంతసమయం తీసుకునైనా పకడ్బందీగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిసింది. ధరణి కమిటీ నివేదిక త్వరలో వస్తుందని.. దానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. మెగా డీఎస్సీ(Dsc) కోసం భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.