Notice To BL Santosh :  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సీఆర్ పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.  ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉండటంతో బీఎల్ సంతోష్ కు స్వయంగా నోటీసులు ఇవ్వలేకపోయారు. హైకోర్టు ఆదేశాలతో నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు.. సిట్ అధికారులకు సహకరించారు. గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ బీఎల్ సంతోష్ హాజరు కాలేదు. దీంతో ఈ సారి పోలీసులు స్వయంగా ఆయన కార్యాలయంలో నోటీసులు అందచేశారు. 


బుధవారం హైకోర్టులో కీలక విచారణ


ఈ అంశంపై సిట్ హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. బీఎల్ సంతోష్‌కు నోటీసులు అందాయని సిట్ అధికారులు తెలిపారు. కీలకమైన విచారణ బుధవారం జరగనుంది. మొత్తం నలుగురికి గతంలో నోటీసులు ఇచ్చారు. కరీంనగర్‌కు చెందిన లాయర్ శ్రీనివాస్ మాత్రం హాజరయ్యారు. మిగిలిన ముగ్గురు బీఎల్ సంతోష్, తుషార్ చెల్లపల్లి,  జగ్గుస్వామి హాజరు కాలేదు.  జగ్గుస్వామిపై సిట్ అధికారులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు జగ్గుస్వామి అందుబాటులోకి లేకుండా పోయారు. సును నుండి తప్పించుకోడానికి వారు దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. అందుకోసం అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేస్తూ లుక్ అవుట్ నోటీసులు ఇచ్చామని పోలీసులు  చెబుతున్నారు. విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని అందులో పేర్కొన్నారు. అయినా కానీ ఆ నోటీసులతో తమకేం సంబంధం లేదన్నట్టు ఆ ముగ్గురు విచారణకు హాజరు కాకపోగా నోటీసులపై కూడా స్పందించలేదు. 


లాయర్ శ్రీనివాస్ ఇచ్చిన  వివరాలతో మరికొంత మందికి నోటీసులు ?


కరీంనగర్ లాయర్ శ్రీనివాస్‌ విచారణలో ఇచ్చిన వివరాల ఆధారంగా రాష్ట్రంలోని ఇంకొందరికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. శ్రీనివాస్​ను కూడా మరోసారి విచారించనున్నారు. ఇందుకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు సిట్ బృందం చర్యలు తీసుకుంటోంది. సింహయాజికి  బుక్‌‌ చేసిన  ఫ్లైట్‌‌ టికెట్లు, బ్యాంక్‌‌ ట్రాన్సాక్షన్లను బట్టి స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేసినట్లు తెలిసింది. శ్రీనివాస్ స్టేట్​మెంట్ ఆధారంగా రోహిత్‌‌ రెడ్డితో నందకుమార్‌‌‌‌ డీల్‌‌ డిస్కషన్‌‌ గురించి విరాలను సిట్ సేకరిస్తోంది. 


రామచంద్ర భారతి సన్నిహితులపై సిట్ పోలీసుల దృష్టి 


రామచంద్రభారతితో సన్నిహితంగా ఉన్న వారి వివరాలు కూడా పోలీసులు బయటకు లాగుతున్నారు. కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న రామచంద్రభారతికి అత్యంత సన్నిహితులుగా   ఉన్న వారిలో కేంద్రమంత్రులున్నట్లుగా చెబుతున్నారు.   ఇప్పటికే అదుపులో ఉన్న నిందితులకు సంబంధించిన వీడియోల్లో రాజస్తాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సిద్ధంచేసిన ప్రణాళిక, దీనికి తామందించిన సహకారం వంటి అంశాల ప్రస్తావన ఉండటంతో ఈ వ్యవహారంలో వీరికి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నట్లు చెబుతున్నారు. త్వరోల మరిన్ని అరెస్టులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.