TS Rains : తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కలెక్టర్లతో సహా సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సూచించారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. 






భైంసాలో జలవిలయం 


తెలంగాణకు రాగల మూడ్రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మూడ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.  నిర్మల్ జిల్లా భైంసా పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గడ్డెన్న వాగు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేయడంతో వరద భైంసా పట్టణాన్ని చుట్టుముట్టింది. గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేయడంతో నాలుగు గేట్లు ఎత్తివేసి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి విడుదలతో భైంసా పట్టణంలోని వివేకానంద చౌక్, ఆటోనగర్‌, పద్మావతి కాలనీలు నీటిలో మునిగిపోయాయి. దిగువన ఉన్న ఎన్‌ఆర్‌ గార్డెన్‌లో ఆరుగురు సిబ్బంది చిక్కుకున్నారు. ఎన్‌ఆర్ గార్డెన్ చుట్టూ సుద్ద వాగు పొంగిప్రవహిస్తుంది. 






హైదరాబాద్ లో భారీ వర్షం


గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్  నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెల్లడించారు. నగరంలో మరికొన్ని గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో శనివారం మేయర్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షప్రభావాన్ని పరిశీలించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ ను పరిశీలించి వచ్చిన ఫిర్యాదుల ఆరా తీశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం, కంట్రోల్‌ రూం పనితీరు, ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిన్నటి నుంచి 1.5 నుంచి 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఇప్పటి వరకూ 383 ఫిర్యాదులు అందాయని,  వాటిల్లో 375 పరిష్కరించామన్నారు. నగరంలోని 197 చెరువుల  వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వ్యాధులను నియంత్రించడానికి  ఎంటమాలోజి  విభాగం ఫాగింగ్, స్ప్రేయింగ్, లార్వా నిరోధక చర్యలను ఇప్పటికే చేపట్టిందన్నారు. మొబైల్, మినీ మొబైల్, స్తాటికల్ లాంటి మాన్సూన్ ఎమర్జెన్సీ  టీమ్ లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నీరు నిలిచిన ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరవాసులు తమ ఫిర్యాదులను 040-21111111, 040-29555500 నంబర్లలో సంప్రదించాలని మేయర్ తెలిపారు.