Minister Harish Rao: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు పగోళ్లుగా మారాయని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా బాగా ఆలోచించే.. పని చేసే బీఆర్ఎస్ కావాలా, పగోళ్లు కావాలా ఆలోచించుకోవాలని సూచించారు. ఓటమి భయంతోనే బీజేపీ జమిలీ ఎన్నికలకు ప్లాన్ చేసిందని కామెంట్లు చేశారు. జనాన్ని నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీకి జమిలి ఎన్నికలతో ఎలాంటి నష్టం లేదని చెప్పారు. కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎమ్మెల్సీ కవితపై లేనిపోని ఆరోపణలు చేస్తూ.. కేసులు పెట్టారని అన్నారు. కానీ తమకు కోర్టులపై న్యాయం, ధర్మం మీద నమ్మకం ఉందన్నారు. ఎవరు ఏం చేసినా చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తుందన్నారు. ప్రతిపక్షాల ఎప్పుడూ కేసులు పెట్టే బీజేపీ.. ఒక్క కాషాయదళ నాయకుడిపై కూడా కేసు ఎందుకు పెట్టదో చెప్పాలని అడిగారు. అభివృద్ధి చేస్తూ.. అందరి మనసుల్లో స్థానాలు సంపాధించుకోవాలనే కానీ... ప్రతిపక్షాలను బలహీనం చేసి గెలవాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు. 






ప్రజలకు ఏం కావాలో ఆలోచించి అదే చేసే సీఎం కేసీఆర్ ను గెలిపించుకుంటే.. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. పల్లెలు, పట్టణాలతో పాటు పాడి, ప్రాజెక్టులు ఇలా ఏం రంగంలో చూసినా తెలంగాణ ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉందో, ఇప్పటి తెలంగాణ ఎలా ఉందో ఓ సారి ఆలోచిస్తే ప్రజలకు విషయం అంతా అర్థం అవుతుందని అన్నారు. నాడు కాలువల్లో నీలు లేక వెలవెలబోతే.. ఇప్పుడు కాలువలు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయన్నారు. వాటి ఫలితంగానే రాష్ట్రంలో అనుకున్న దానికంటే అధిక దిగుబడి వస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వచ్చి నీతులు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ... 50 ఏళ్ల పాలనలో రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, జిల్లాకో మెడికల్ కాలేజీ వంటి పథకాలను తీసుకురాలేదో చెప్పాలన్నారు. నిజంగానే రాష్ట్రాభివృద్ధిపై వాళ్లకు మనసు ఉంటే.. తెలంగాణ ఎప్పుడో బాగయ్యేదని చెప్పుకొచ్చారు. 


తొమ్మిదేండ్లలో 29 కాలేజీలు


తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఉన్నవి 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రమేనని మంత్రి హరీష్ రావు తెలిపారు. వీటిలో ఉస్మానియా (1946), గాంధీ (1954) మెడికల్‌ కాలేజీలు ఉమ్మడి ఏపీ ఆవిర్భావానికి ముందు నుంచే ఉన్నాయన్నారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీని ప్రైవేట్‌ సంస్థ ఏర్పాటు చేస్తే ఉమ్మడి ప్రభుత్వం తీసుకుందని.. అంటే దాదాపు ఆరు దశాబ్దాల్లో ఉమ్మడి పాలకులు తెలంగాణలో ఏర్పాటు చేసింది కేవలం రెండు కాలేజీలు మాత్రమేనని చెప్పుకొచ్చారు.

 

అవి ఆదిలాబాద్‌ లోని రిమ్స్‌, నిజామాబాద్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలని వివరించారు. మొత్తంగా చూస్తే కేవలం నాలుగు జిల్లాల్లోనే మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని.. కానీ సీఎం కేసీఆర్‌ తొమ్మిదేళ్లలో 29 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశారని తెలిపారు. అంటే సగటున ఏడాదికి మూడు కాలేజీలు ఏర్పాటయ్యాయని... ఈ ఏడాది ఏకంగా ఒకేసారి 9 మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానుండడం దేశ వైద్యవిద్య రంగంలోనే సరికొత్త చరిత్రగా నిలిచిందన్నారు. ప్రజలంతా బాగా ఆలోచించుకుని.. సీఎం కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని సూచించారు. అలాగే తాము తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.