Telangana News :  తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి .. హైదరబాద్‌లోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లారు. పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను లాంఛనంగా ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి వెళ్లాలనుకున్నారు. అయితే ఇతర సీనియర్ నేతలందరితో కలిసి వెళ్లి ఆహ్వానిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనతో మాట్లాడి ఇద్దరూ కలిసి ఇతర నేతలతో పాటుగా జూపల్లి నివాసానికి వెళ్లారు. 


సీనియర్లతో సంప్రదించే చేరికలకు గ్రీన్ సిగ్నల్ 


పార్టీలో చేరికలపై పార్టీ నేతల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక నేతలను అడిగి.. వారి అభ్యరంతరాలను పరిశీలించి అందరి ఆమోదంతోనే పార్టీలో చేరికలు ఉంటున్నాయని స్పష్టం ేచశారు. కోమటిరెడ్డి, ఉత్తమ్, జానారెడ్డిని సంప్రదించకుండా ఎవరినీ పార్టీలో చేర్చుకోవడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ముగ్గురి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామన్నారు. ఇంకా చాలా మంది నేతలు పార్టీలో చేరుతారని రేవంత్ రెడ్డి వివరించారు. 


రేవంత్ రెడ్డితో కలిసి పని చేస్తున్నామన్న కోమటిరెడ్డి 


తమ మధ్య రాజకీయ పరంగా ఎలాంటి  బేధాభిప్రాయాలు లేవని.. కలసే ఉన్నామని.. కలిసే ఉంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చేంత వరకూ కలిసే ఉంటామని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటామన్నారు. ఐక్యంగా పని చేస్తూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇటీవల ప్రియాంకా గాంధీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో నిర్వహించనున్న బహిరంగసభలకు రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో పార్టీ వ్యవహారాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. తనకు ఎవరితోనూ వివాదాల్లేవని.. రేవంత్ రెడ్డితో కలిసి పని చేస్తున్నానని.. కోమటిరెడ్డి.. ప్రియాంకా గాంధీకి చెప్పినట్లుగా తెలుస్తోంది. 


పార్టీ బలోపేతానికి కలిసి పని చేస్తున్న కాంగ్రెస్ సీనియర్లు                               


కర్ణాటక ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ కు జోష్ రావడంతో చేరికల కోసం విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు.  పొంగులేటి, జూపల్లి కృష్ణారావులు పార్టీలో చేరేలా మంతనాలు పూర్తి చేశారు. వీరితో పాటు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గుర్నాథ్ రెడ్డి సైతం హస్తం పార్టీకి టచ్‌లోకి వచ్చారు. తాండురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో విభేదాలు ఉన్న పట్నం మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇలా బీఆర్ఎస్ కు ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందనే సంకేతం.. ఇతర పార్టీల్లోని నాయకులకు పంపిస్తోంది తెలంగాణ కాంగ్రెస్


గురువారం ఢిల్లీకి రేవంత్                              


రాహుల్‌తో గురువారం రేవంత్ సమావేశమవుతారని... తెలంగాణలో పర్యటనపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఈ నెలాఖరుకల్లా చేరికలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఇది ఆలస్యమైతే రాహుల్ గాంధీతో పొంగులేటి బ్యాచ్‌ కలిసే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. ఆ భేటీ తర్వాత అధికారక ప్రకటన రావచ్చని టాక్ నడుస్తోంది.