Telangana Municipal Elections: కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు వినూత్న ప్రచారం.. ప్రజల్ని ఆకట్టుకున్న మంత్రి ప్రయత్నం
Telangana Municipal Elections 2026 | కొల్లాపూర్ పట్టణ అభివృద్ధి కోసం తాను కృషిచేస్తానని, రాష్ట్రంలోనే నెంబర్ వన్గా చేస్తానని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Jupally Krishna Rao campaign in Municipal Elections | కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజల దృష్టిని ఆకర్షించారు. వినూత్న కార్యక్రమంలో భాగంగా సైకిల్పై కొల్లాపూర్ పట్టణ వీధుల వెంట తిరుగుతూ శారీరక శ్రమ, మానసిక ఉల్లాసం, ఆరోగ్యకర జీవనశైలి ప్రాధాన్యతను గురించి ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు.
నేటి ఆధునిక జీవనశైలిలో వాహనాలపై అధిక ఆధారపడటం వల్ల శారీరక శ్రమ తగ్గి, అనేక రకాల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో సైకిల్ ప్రయాణం వంటి సాధారణ అలవాట్లు శరీర దృఢత్వంతో పాటు మనసుకు ఆనందాన్ని అందిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి విజయం అందించాలని ప్రజలను మంత్రి జూపల్లి కోరారు.
సైకిల్ వినియోగం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, కాలుష్య నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో సాధ్యమైనంతవరకు సైకిల్ను వినియోగించాలని, శారీరక శ్రమ చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, యువత, రైతులు తమ దైనందిన జీవితంలో సైకిల్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి జూపల్లి చేపట్టిన ఈ వినూత్న ప్రచారానికి పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కొల్లాపూర్ పట్టణంలోని 11వ వార్డులో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని 'ప్రజా ప్రభుత్వం' చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. కొల్లపూర్ పట్టణ రూపురేఖలు మార్చాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉంది. ఈ సమయంలో కొల్లాపూర్ రూపురేఖలు మార్చేలా నిధులు మంజూరు చేయిస్తా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారనే నమ్మకం ఉందని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తం చేశారు.

కొల్లాపూర్ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే విద్యా, వైద్య రంగాలతో పాటు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదలకు కృషి చేశామని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులతో కొల్లాపూర్ పట్టణాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు, ప్రజలు పాల్గొన్నారు.
























