Telangana Municipal Elections 2026: తెలంగాణలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభం
Telangana local body elections 2026 | తెలంగాణలో 7 నగర పాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పర్వం ఉత్సాహంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థల పరిధిలో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఈ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈసారి పురుష ఓటర్ల (25,49,750) కంటే మహిళా ఓటర్ల (26,67,025) సంఖ్యే అధికంగా ఉంది. ఇతరులు 638 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
2,981 స్థానాలకు 12,944 మంది పోటీ
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే, 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు గానూ 12 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. అలాగే, మక్తల్ మున్సిపాలిటీలోని ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడటంతో, ప్రస్తుతం 2,569 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. మున్సిపాలిటీల్లో 10,719 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 414 డివిజన్లలో రెండు చోట్ల ఏకగ్రీవం కావడంతో, మిగిలిన 412 స్థానాలకు 2,225 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా 2,981 స్థానాలకు 12,944 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. మున్సిపాలిటీల్లో 6,017 మరియు కార్పొరేషన్లలో 2,174 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ భారీ ఎన్నికల ప్రక్రియలో 41,773 మంది పోలింగ్ సిబ్బందితో పాటు 1,379 మంది రిటర్నింగ్ అధికారులు పాలుపంచుకుంటున్నారు. భద్రత కోసం పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సమస్యాత్మకమైన 8,191 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా నిరంతరం నిఘా ఉంచినట్లు ఎస్ఈసీ కార్యదర్శి లింగ్యా నాయక్ వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. రాష్ట్ర ప్రభుత్వం సెలవు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు (బుధవారం, ఫిబ్రవరి 11) జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పోలింగ్ ప్రాంతాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సెలవు కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా, ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంస్థలకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులకు ఇది 'పెయిడ్ హాలిడే' (వేతనంతో కూడిన సెలవు)గా పరిగణిస్తారు. తద్వారా ప్రతి ఒక్కరూ తమ స్థానిక ఎన్నికల్లో భాగస్వాములు కానున్నారు.
అయితే, ఈ సెలవు నిర్ణయం కేవలం ఎన్నికలు నిర్వహిస్తున్న పట్టణ స్థానిక సంస్థల (ULBs) సరిహద్దులకు మాత్రమే పరిమితం చేశారు. ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులందరూ ఖచ్చితంగా పోలింగ్లో పాల్గొని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని అధికారులు కోరుతున్నారు. ఓటరు స్లిప్పులు, గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి బాధ్యతగా ఓటు వేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.























