Telangana Municipal Election Results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. తొలి ఫలితం తేలేది అక్కడే
Counting for 7 Corporations and 116 Municipalities | నేడు తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 నగర పాలక సంస్థల ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.

Telangana Municipal Election Results 2026 | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలికల్లోని 2,569 వార్డుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫిబ్రవరి 11న జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం (ఫిబ్రవరి 13న) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం 123 కేంద్రాలలో కౌంటింగ్ కోసం పక్కా ఏర్పాట్లు చేసింది. అలంపూర్లో కేవలం 7,104 ఓట్లు ఉండటంతో, మొదటి రౌండ్లోనే ఈ మున్సిపాలిటీ ఫలితం వస్తుంది.
మధ్యాహ్నానికి మున్సిపాలిటీ రిజల్ట్స్.. సాయంత్రానికి కార్పొరేషన్లు..
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా మధ్యాహ్నానికి మున్సిపాలిటీల ఫలితాలు తేలనున్నాయి. సాయంత్రం లోపు 7 కార్పొరేషన్ల ఫలితాలు వెలువడనున్నాయని అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా నిషేధాజ్ఞలు కూడా విధించారు.
కౌంటింగ్ సెంటర్ల వద్ద వెబ్కాస్టింగ్ నిఘా
కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ప్రతి కేంద్రంలోనూ వెబ్కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. లెక్కింపు హాలులోకి కేవలం ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, వారి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు కఠిన నిషేధం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం సాధారణ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు మొదలవుతుంది. అన్ని బ్యాలెట్ బాక్సులను డ్రమ్ములలో కలిపి, ప్రతి రౌండ్లో 1,000 ఓట్ల చొప్పున ఒక్కో టేబుల్కు పంపిస్తారు. అభ్యర్థుల వారీగా ఓట్లను వేరు చేసి, కట్టలుగా కట్టి తుది ఫలితాలను ప్రకటిస్తారు.
తొలి ఫలితం తేలిది ఇక్కడే..
పట్టణాల జనాభా, పోలైన ఓట్ల ఆధారంగా ఫలితాల సమయం మారుతుంది. ముఖ్యమైన పట్టణాల ఫలితాల రౌండ్ల వివరాలు ఇలా ఉన్నాయి. పురపాలికల్లో వార్డుకో టేబుల్ చొప్పున ఏర్పాటు చేయగా, అత్యల్పంగా అలంపూర్లో కేవలం 7,104 ఓట్లు ఉండటంతో, అక్కడ మొదటి రౌండ్లోనే ఫలితం వెలువడనుంది. జనగామ ఫలితం రెండు రౌండ్లలో, అంటే ఉదయం 11 గంటల లోపే వచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా మిర్యాలగూడలో 72,036 ఓట్లు ఉండగా, అక్కడ రెండు రౌండ్లు పడుతుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 వార్డులకు 66 టేబుళ్లు ఏర్పాటు చేసి, నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తి చేస్తారు. నిజామాబాద్లో నాలుగు రౌండ్లు, మహబూబ్నగర్, రామగుండం, నల్గొండలలో మూడు రౌండ్ల చొప్పున లెక్కింపు జరుగుతుంది. మంచిర్యాల, కొత్తగూడెంలలో రెండు రౌండ్లలోనే ఫలితాలు వస్తాయి.
ఫిబ్రవరి 16న మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. అదే విధంగా నగర పాలక సంస్థలకు మేయర్, డిప్యూటీ మేయర్ లను సైతం ఎన్నుకుంటారు. ఇందుకోసం పార్టీలు ముందుగానే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ శాతం..
తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలికల్లో (Municipalities) జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.01 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 52.17 లక్షల మంది ఓటర్లకు గాను 38.09 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురపాలికల్లో ఓటింగ్ శాతం అధికంగా 75.88 శాతంగా నమోదు కాగా, నగరపాలక సంస్థల్లో 66.05 శాతంగా నమోదైంది. పురుషుల ఓటింగ్ శాతం 72.63 కాగా, మహిళలు 73.39 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
























