Telangana Gurukul Food Poisoning:  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే  బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల హాస్టల్‌లో మరోసారి  ఫుడ్ పాయిజన్ అయి తీవ్ర కలకలం రేపింది. బుధవారం రాత్రి హాస్టల్లో వడ్డించిన భోజనం తిన్న తర్వాత పలువురు విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పి, వాంతులు, వికారంతో అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో భయాందోళనకు గురైన సిబ్బంది, తక్షణమే వారిని స్థానిక బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Continues below advertisement

వైద్యులు అత్యవసర చికిత్స అందించిన అనంతరం పరిస్థితి కాస్త కుదుటపడటంతో రాత్రికి కొందరు విద్యార్థినులు తిరిగి హాస్టల్‌కు చేరుకున్నారు. అయితే, గురువారం ఉదయం మళ్లీ మరికొందరు బాలికలు తీవ్రమైన వాంతులు, వికారంతో బాధపడటంతో హాస్టల్‌లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఉదయానికే అస్వస్థతకు గురైన బాలికల సంఖ్య పెరగడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని మళ్లీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో విద్యార్థినులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఈ  ఘటనలో ఇప్పటివరకు సుమారు 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో వరుసగా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతుండటంపై బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని నిత్యావసర సరుకులు, పరిశుభ్రత లోపించిన వంటశాలల వల్లే తమ పిల్లల ప్రాణాల మీదకు వస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా పురుగుల మయమైన ఆహారాన్ని అందిస్తున్నారని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.

Continues below advertisement

ఘటనపై సమాచారం అందుకున్న విద్యాశాఖ, సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని ఆరా తీస్తున్నారు. బుధవారం రాత్రి వడ్డించిన ఆహార పదార్థాలు, తాగునీటి నమూనాలను సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపుతున్నట్లు తెలిపారు. పాఠశాల కాంట్రాక్టర్, కేర్‌టేకర్ల అలసత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆహార భద్రతా అధికారులతో విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో, సంక్షేమ వసతి గృహాల్లో వికటిస్తున్న ఆహార వ్యవస్థపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే బెల్లంపల్లిలో మళ్లీ ఇలాంటి ఘటన చోటుచేసుకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలందరూ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని, భయపడాల్సిన పనిలేదని వైద్యులు స్పష్టం చేసినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి భోజన వికటించే ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.