Local elections with old reservation quota : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని కోర్టు డెడ్ లైన్ పెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకు వచ్చిన రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదు. ఢిల్లీలో ధర్నా చేసిన సీఎం రేవంత్ ప్రధానిగా రాహుల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీలకు 42 శాతం కోటా ఇస్తామని ప్రకటించారు. అంటే ఇప్పుడు.. రిజర్వేషన్లకు అవకాశం లేదని ప్రభుత్వం కూడా నిర్ణయానికి వచ్చినట్లే అనుకోవచ్చు. మరి ఇప్పుడు స్థానిక ఎన్నికల విషయంలో సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.  

తమ ఎదుట మూడు ఆప్షన్లు ఉన్నాయంటున్న రేవంత్          

బిసిలకు 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్రపతి నుండి ఎలాంటి స్పందన లేనందున  సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సీఎం రేవంత్ అంటున్నారు. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే..  ఇక్కడి వరకు వచ్చామమని.. ప్రస్తుతం ప్రభుత్వం ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని రేవంత్ అంటున్నారు. అందులో ఒకటి  కేంద్రం ఆమోదం తెలిపే వరకు వేచి చూడాలి. ఇప్పుడల్లా ఆమోదిస్తారన్న నమ్మకం లేదు. స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఇక  జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం. అయితే జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే.. అది న్యాయపరమైన వివాదాల్లో ఇరుక్కుంటుంది. దీని వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతాయి.           

పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలుక వెళ్లే యోచన          

మూడో ఆప్షన్ గా  42 శాతం బీసీలుక రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడమని రేవంత్ అన్నారు.  ప్రభుత్వం జీవో ఇచ్చి ఎన్నికలకు ఎవరైనా కోర్టుకు పోతే స్టే ఇస్తుంది. రిజర్వేషన్ గురించి అబద్ధపు హామీలు ఇచ్చి నేను ఎన్నికలకి నేను పోలేనన్నారు. సెప్టెంబర్ 30 కల్లా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలి కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలన్నదానిపై  చర్చిస్తున్నామన్నారు. తొందరలోనే PAC సమావేశం ఏర్పాటు చేస్తాం చర్చ చేస్తామని.. గ్రామాల్లో ఎలా ఉంది పరిస్థితి అనేది అడిగి తెలుసుకుంటామంటున్నారు.  

తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి 

ఇప్పటికే  స్థానిక సంస్థలకు కేంద్రం నుండి వచ్చే నిధులు ఆగిపోయాయాని రేవంత్ అన్నారు. జంతర్ మంతర్ లో నిన్నటి దీక్ష మా నిరసన దేశవ్యాప్తంగా తెలంగాణ బిసి రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటం తెలియాలి అనే చేశామన్నారు. రాహుల్ గాంధీ శిబు సోరేన్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ రాలేదు అని ప్రతిపక్షాలు చేసే వ్యాఖ్యలు  తాను పట్టించుకోనని తేల్చేశారు. 

పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు.కానీ పాత కోటాతోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని వల్ల విపక్షాలు ఎదురుదాడి చేయడానికి అవకాశం ఉంది.