Telangana Bomb Threat: తెలంగాణ హైకోర్టు, నాంపల్లి సీబీఐ కోర్టులకు బాంబు బెదిరింపులు.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
Bomb Threat To Telangana high Court: తెలంగాణ హైకోర్టు, నాంపల్లి సీబీఐ కోర్టులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులను పేల్చివేస్తామని నిందితులు మెయిల్స్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ హైకోర్టుతో పాటు నాంపల్లి సీబీఐ కోర్టును పేల్చివేస్తామని బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు, హైకోర్టుకు వరుసగా బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వస్తున్నాయి. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో పోలీసులు రంగంలోకి దిగి కోర్టు ప్రాంగణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
వరుసగా బాంబు బెదిరింపులు.. అసలేం జరుగుతోంది..
ఇటీవల ఫిబ్రవరి 18, 2026 (బుధవారం) నాడు మొదటగా గుర్తుతెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రాగా, మళ్ళీ ఫిబ్రవరి 20 (శుక్రవారం) నాడు రెండోసారి అదే తరహా బెదిరింపు రావడంతో లాయర్లు, సిబ్బంది, తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కోర్టు ప్రాంగణంలో ఆర్డీఎక్స్ (RDX) అమర్చినట్లు, అవి మధ్యాహ్నం సమయంలో పేలుతాయని ఇటీవల టైం కూడా ఆ మెయిల్స్లో మెన్షన్ చేశారు. బాంబు బెదిరింపు మెయిల్ సమాచారం అందుకున్న వెంటనే అబిడ్స్, నాంపల్లి పోలీసులు అప్రమత్తమై, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కోర్టు అంతటా ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ బెదిరింపులు అని పోలీసులు పేర్కొన్నారు.
ఇటీవల కేవలం నాంపల్లి కోర్టుకే కాకుండా, కరీంనగర్ జిల్లా కోర్టుకు, నగరంలోని పలు ఆస్పత్రులకు సైతం బాంబు బెదిరింపులు రావడం తెలిసిందే. ఈ వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు కోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయి? వీటి వెనుక ఉన్నది ఎవరు.. తమకు అన్యాయం జరిగిందని ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారా.. లేక ఏదైనా కుట్ర కోణం ఉందా అని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పదేపదే ఇలాంటి బెదిరింపులు ఎందుకు వస్తున్నాయో అర్థంకాక కోర్టు సిబ్బందితో పాటు, కేసు విచారణకు హాజరయ్యే వారు సైతం ఆందోళనకు గురవుతున్నారు.
























