Telangana BJP Manifesto: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం అమిత్ షా 17న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో 18 తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. 18వ తేదీ సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం నల్గొండ, వరంగల్‌, గద్వాల్‌, రాజేంద్రనగర్‌ సభల్లో అమిత్‌ షా పాల్గొంటారు. 


వాస్తవానికి తెలంగాణ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు 17వ తేదీ ముహూర్తం ఫిక్స్ చేశారు. అమిత్ షా చేతుల మీదుగా విడుదల చేయాలని బీజేపీ వర్గాలు భావించాయి. దీంతో బీజేపీ మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు ఉంటాయన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. తెలంగాణలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే.. విద్య, వైద్యం ఉచితంగా అందించే హామీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. 


మేనిఫెస్టోలో ఏం ఉంటాయి
మేనిఫెస్టోలో జాబ్‌ క్యాలెండర్‌, ఉపాధి అవకాశాలపై హామీలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో పలు నగరాల పేర్లు మారుస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పొందుపర్చినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసింది బీజేపీ. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌ గా, ఉస్మానాబాద్ పట్టణానికి ధరాశివ్‌ గా పేరు మార్చింది కేంద్రం. మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి ఉండటంతో అక్కడ ఆ పని సులువుగా జరిగింది. 


23 తరువాత తెలంగాణలో బీజేపీ నేతల మకాం
ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నవంబర్ 23వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత బీజేపీ జాతీయ నేతలంతా తెలంగాణలో మకాం వేయనున్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తెలంగాణను చుట్టేశారు. మరోసారి.. నవంబర్ 25, 26, 27 తేదీల్లో వస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రచారానికి చివరి వారం కీలకంగా మారనుంది. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల పార్టీ ముఖ్య నేతల తాకిడి రాష్ట్రానికి పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.


నెలకోసారి పర్యటించిన అమిత్ షా
ఈ ఏడాది ప్రారంభం నుంచి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక ద‌ృష్టి సారించారు. ప్రతి నెలా తెలంగాణలో పర్యటిస్తున్నారు. వచ్చిన ప్రతి సారి నేతలతో సమావేశం అవుతున్నారు. పార్టీ బలోపేతం అంశాలపై చర్చిస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టేవారు. తాజాగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా దూకుడు పెంచారు. తెలంగాణలో వరుసగా పర్యటిస్తున్నారు. 


బీసీకి సీఎం పదవి
వాస్తవానికి అమిత్ షా ఇప్పటికే మరో సారి తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. గత అక్టోబర్‌లో సూర్యాపేట జిల్లాలో అమిత్ షా పర్యటించారు. సూర్యాపేటలో తలపెట్టిన జనగర్జన సభకు హాజరై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. బీజేపీ గెలిస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని చెప్పారు. మోదీ ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు.


రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం బీజేపీ పని చేస్తుందని అమిత్ షా అన్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసమే ఆలోచిస్తాయని. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. పేద, దళిత వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్ విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి హామీని మర్చిపోయిన వ్యక్తి వ్యక్తి కేసీఆర్ అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.