కాంగ్రెస్‌లో కారుచిచ్చు..


అంతర్గతపోరుతో అధోగతి పాలవుతున్న పార్టీ


సీనియారిటీ పేరుతో పార్టీకి నష్టం చేస్తున్నారా..?


ముందరి కాళ్లకు బందం వేస్తున్నదెవరు..? వేయించేదెవరు..?


తెలంగాణ ఇచ్చిన పార్టీగా కొత్త రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో వస్తున్న సానుభూతిని రోజురోజుకు కోల్పోతుంది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో క్రమశిక్షణ లోపించడం ప్రత్యర్థి పార్టీలకు కొండంత బలాన్ని అందిస్తుంది. ఓ వైపు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీపై పోరు చేయాల్సిన నాయకులు కాస్తా అంతర్గత కుమ్ములాటలో నిమ్మగ్నమై ఇప్పటికే అంపశయ్యపై ఉన్న పార్టీని కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


2023లో జరిగే ఎన్నికల్లో విజయం సాదించాలని, పార్టీని బలోపేతం చేయాలని బావించిన అధిష్టానం ఇటీవల జంబో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఏర్పాటు అనంతరం నుంచి పార్టీలో అసంతృప్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఓ వైపు సీనియర్‌ నాయకురాలు కొండా సురేఖ పార్టీ పదవికి రాజీనామా చేసి తన అసంతృప్తిని వెల్లగక్కారు. ఆ తర్వాత మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా ఆ వరుసలో చేరిపోయారు. అయితే అప్పట్నుంచి సీఎల్‌పీ నాయకుడు భట్టి ఇంట్లో సమావేశమవుతున్న నేతలు కాస్తా ఒక్కసారిగా తమ అసంతృప్తిని వెల్లగక్కడంతో ఇప్పుడు ఈ వివాదం కాంగ్రెస్‌ను అప్రతిష్ట పాలు చేస్తుంది.


జీ – 9 నేతల టార్గెట్‌ రేవంతేనా..?


కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వేసిన నూతన జంబో కమిటీలో తమ వర్గానికి అసలు ప్రాధాన్యత కల్పించలేదని, కేవలం టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించారని పేర్కొంటూ సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్క ఇంట్లో ఆ పార్టీ నేతలు మధుయాష్కీగౌడ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీదర్‌బాబు, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కోదండరెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహా తదితరులు గ్రూప్‌ – 9 నేతలుగా పేర్కొంటూ విమర్శలకు పాల్పడ్డారు. ఇందులో ప్రధానంగా వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యత కల్పించారనే ఆరోపణే ప్రధానం కావడం గమనార్హం.


అయితే వీరు ఆరోపించినట్లు రేవంత్‌రెడ్డితోపాటు టీడీపీ నుంచి వచ్చిన వారిలో కేవలం 14 మందికి మాత్రమే ఈ కమిటీలో పదవులు ఇవ్వడం, 198 మందిలో మిగిలిన వారంతా సీనియర్‌ నాయకులు కావడం గమనార్హం. మరోవైపు ఈ కమిటీ కూర్పు పూర్తిగా ఏఐసీసీ పర్యవేక్షణలో జరగ్గా తమను సంప్రదించకుండానే కమిటీ వేశారనే ఏకంగా సీఎల్‌పీ నాయకుడు భట్టి ఆరోపించడం గమనార్హం. అయితే ఇందుకు బిన్నంగా అందరి నుంచి వినతులు స్వీకరించిన తర్వాతనే ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం సాగుతుంది.


ఇదిలా ఉండగా కమిటీ పేరుతో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత గులాభీ ఆకర్ష్‌కు సీఎల్‌పీ హోదానే కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో కాస్తా బలం పుంజుకుంది. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ సభతోపాటు దళిత సభలు ఏర్పాటు చేసిన రేవంత్‌ పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్నుంచి సీనియర్‌లు మాత్రం ఎవరో ఒక్కరు వలస వెళ్లడం, పార్టీపైనే ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్‌కు వస్తున్న శరిష్మాను కాలరాస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పీసీసీ కమిటీపై ఏకంగా సీనియర్లు అంతా ఏకతాటిగా వచ్చి రేవంత్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేయడం గమనార్హం. అయితే ఈ విమర్శలు చేస్తున్న నాయకులు అసలు కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ పార్టీ ఎదుగుదలకు ఎలాంటి పనులు చేశారనే విశ్లేషణలు ఎక్కువవుతున్నాయి.


పాదయాత్రకు కళ్లెం వేసేందుకేనా..?


రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర సందర్భంగా తెలంగాణలో మంచి రెస్పాన్స్‌ కనిపించింది. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా పెండింగ్‌లో పడుతున్న పాదయాత్రను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని బావించి పాదయాత్రకు రెవంత్‌ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఐదునెలల పాటు నిర్విరామంగా తెలంగాణలో పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు  రేవంత్‌ పాదయాత్రకు సీనియర్లు తమ పిర్యాదులు, అసంతృప్తులతో చెక్‌పెట్టగా ఈ దపా మాత్రం పాదయాత్రకు ఏఐసీసీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందనే సమాచారం. ఈ పాదయాత్రకు ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాందీ వస్తుందనే ప్రచారం జరుగుతుంది.


ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రేవంత్‌రెడ్డి శరిష్మాకు అడ్డుకట్ట వేస్తూ వస్తున్న సీనియర్‌ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ఆరోపణలను సందించారని సమాచారం. మరోవైపు తెలంగాణలో అధికారంలోకి వస్తే సీఎం సీటుపై గురిపెట్టిన సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్క గత ఏడాది కాలంగా పాదయాత్ర చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి ఏఐసీసీ అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో రేవంత్‌ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే అటు ప్రజల్లో, ఇటు పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతారని బావించి సీనియర్లు ఈ విదంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సీనియర్ల ఆరోపణలకు చెక్‌పెట్టేందుకు ఇప్పుడు రేవంత్‌ వర్గం కూడా సిద్దం కావడం, 14 మంది పార్టీ పదవులకు రాజీనామా చేయడం గమనార్భం. ఏది ఏమైనా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం,  స్వాతంత్రంతో క్రమశిక్షణ కోల్పోయిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ శాఖని గాడిలో పెట్టేందుకు ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.