Telangana BJP : తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి పార్టీని క్షేత్ర స్థాయిలో యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇళ్లపై పోరాటం చేస్తున్నారు. తాజాగా  ‘రైతు వద్దకు బీజేపీ' కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణచించారు.  గురువారం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా  కిషన్ రెడ్డి ప్రకటించారు . హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన  వ్యవసాయ పద్ధతులపై అవగాహనతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులకు వివరిస్తామని తెలిపారు. 2.8 కోట్ల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తామని వివరించారు. వీటిలో తొలిదశలో గురువారం  1.25 లక్షల దుకాణాలను ప్రధాని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.


తెలంగాణలో మార్పు తేవడం బీజేపీకే సాధ్యం : కిషన్ రెడ్డి 


కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రెండు పార్టీలు గతంలో కలిసి గతంలో కలిసి పని చేశాయి..పోటీ కూడా చేశాయని చెప్పారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్, ఎంఐఎంకు ఓటు వేసినట్లేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం  లోపాయికారీ ఒప్పందాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు.  కేంద్రంపై అవిశ్వాసం తీర్మానంతో ఒరిగేది ఏమీలేదని కొట్టిపారేశారు. బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ తో పోరాటం చేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు అవినీతి, కుటుంబ పార్టీలేనని ఆరోపించారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా మూడు పార్టీలు అనేక సార్లు తెలంగాణను పరిపాలించాయని చెప్పారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం దగ్గర ఉందని..తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీనే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి. 


29న హైదరాబాద్‌కు  అమిత్ షా 


ఈనెల 29న హైదరాబాద్ అమిషా రానున్నారు.  టీబీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్ లకు కీలకబాధ్యతలను అప్పగించనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న హైకమాండ్…ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ స్పీడ్ పెంచింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.  అమిత్ షా పర్యటనకు సంబంధించి రాష్ట్ర బీజేపీ అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది. బండిసంజయ్ ను పార్టీ అధ్యక్షుడి స్థానం తొలగించడం..కిషన్ రెడ్డిని ఆ పదవిలో నియమించడం పార్టీ నేతల్లో సమన్వయం లోపం..వీటన్నింటిని బీజేపీ సరిదిద్దే పనిలో పడింది.


వార్ రూం ఏర్పాటు చేసుకుంటున్న కిషన్ రెడ్డి 


స్టేట్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి..చాలా బిజీగా మారారు. 29న తేదీని అమిత్ షా పర్యటన నేపథ్యంలో పలు ప్రతినిధులో భేటీ కానున్నారు. అంతేకాదు రాష్ట్ర కార్యాలయంలో  వార్ రూం ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభించారు. అయితే వార్ రూం ఇంచార్జీగా ఎవరిని పెడతారన్న దానిపై కూడా చర్చ జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా బాధ్యతలను అర్వింద్ , రఘునందన్ లకు అప్పగిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ఇంకా అధికారికంగా వెలువడలేదు. అయితే కొన్ని రోజులుగా బీజేపీ హైకమాండ్ పై రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.