K Laxman on Congress: ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని పదే పదే విమర్శిస్తూ.. కాంగ్రెస్ బీసీలను అవమానిస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించిదని తెలిపారు. అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్‌కు మనసు రాలేదన్నారు. ఐదుగురికి భారతరత్న ఇస్తే.. కాంగ్రెస్ ఓర్వలేక పోతుందని దుయ్యబట్టారు. అయోధ్య పర్యాటక, ఆధ్యాత్మిక రంగంగా వెలుగొందుతోందని లక్ష్మణ్ తెలిపారు. రాముడు, రామసేతు మిథ్య అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోందన్నారు. హిందువులను, హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదమని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సదర్భంగా....పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అర్ధవంతంగా జరిగాయని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం విషయంపై పార్లమెంటులో చర్చిస్తే కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కిందని.. త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం హిందుత్వం కోసం పని చేస్తుందనీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించడంపై మండిపడ్డారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పోరెడ్డి కిషోర్ , సునీత రెడ్డి , సంగప్ప , తదితరులు పాల్గొన్నారు.


‘‘మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, పేదల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అసంభవమైన అంశాలను సాధించిన చరిత్ర, సాహసోపేతమైన నిర్ణయాల గురించి తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం వంటి అనేక చరిత్రాత్మకమైన, సాహసోపేత చర్యలు, కార్యక్రమాలు చేయడం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై, దాదాపు 50 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ... మరీ ముఖ్యంగా 2004 నుండి 2014వరకు పది సంవత్సరాల యూపీఏ పాలనపై ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయడం జరిగింది.


కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల చరిత్రలో మొదటి ప్రధాని నెహ్రూ నుండి రాజీవ్ గాంధీ గారి వరకు ప్రజా వ్యతిరేక నినాదాలు, అవినీతి కుంభకోణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై, మహిళలు, రైతుల విషయంలో వారి వివిక్ష  గురించి  పార్లమెటులో ప్రధాని నరేంద్రమోదీ చాలా స్పష్టంగా ఆధారాలతో బహిర్గతం చేశారు. పదేండ్ల ఎన్డీయే పాలన.. స్వర్ణయుగం లాంటిది. యూపీఏ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, కుంభకోణాలు, బడగు, బలహీన వర్గాలపై వివక్షతతో కొనసాగింది. కేవలం నెహ్రూ కుటుబం కోసమే కాంగ్రెస్ పనిచేసిన విధానాన్ని పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ విశ్లేషించారు. రాహుల్ గాంధీ .. నరేంద్ర మోదీ ప్రస్తావించే అంశాలపై చర్చకు రాకుండా వ్యక్తిగత విమర్శలతో ఎదురుదాడికి దిగడం హేయనీయం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కులం పేరుతో దూషించి ఓబీసీలను అవమానపర్చడం సబబు కాదు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను వారి రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అణచివేసింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి పేరు చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు దండుకుని నేడు మొసలికన్నీరు కారుస్తోంది. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ భారతరత్న ఇచ్చేందుకు మనసు రాలేదు. ఇది నెహ్రూ కుటుంబం నైజం. అంబేద్కర్ గారిని ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్ ఓడించింది. బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంటులో విభేదించారు. కులాల పేరు మీద దేశం విడిపోతుందని రాజీవ్ గాంధీ ప్రస్తావించిన అంశాన్ని మోదీ పార్లమెంటులో ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకుల యొక్క చరిత్రను బట్టబయలు చేయడంతో రాహుల్ గాంధీ.. మోదీ గారి పట్ల తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.


1994లో అప్పటి గుజరాత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చబిల్ దాస్ మెహతా ప్రభుత్వం మోదీ గారి యొక్క సామాజికవర్గం తేలీ సమాజ్ ని బక్షీ కమీషన్ యొక్క సిఫార్సుల మేరకు పొందుపరిచింది. మోదీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వారి సామాజికవర్గాన్ని ఓబీసీలలో చేర్చారని కాంగ్రెస్ నాయకులు అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారు. 2001 సంవత్సరంలోనే మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా మోదీ గారి ప్రభుత్వం  వివిధ రంగాల్లో దేశానికి సేవలందించిన మహానీయులకు భారతరత్న అవార్డలను ప్రకటించింది. దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.


11 రోజులు దీక్ష తీసుకుని నిష్టతో 140 కోట్ల మంది దేశ ప్రజల ప్రతినిధిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటే దాన్ని కూడా రాజకీయాలకు ముడిపెడుతున్నారు. మూడవసారి కూడా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారనే అక్కసుతో, ఆక్రోషంతో అసత్య ప్రచారం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ రాజకీయంగా మూల్యం చెల్లించుకోకతప్పదు. ప్రజలు కర్రుకాల్చి వాత పెడ్తరు. రామమందిర ప్రారంభోత్సవం రోజున పార్టీలకతీతంగా దేశం మొత్తం కదిలి దీపావళి పండుగ జరుపుకుంది. ఈ విషయాన్ని పార్లమెంటులో వ్యాఖ్యానిస్తే మతోన్మాద రాజకీయాలను ప్రేరేపిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ మతంరంగు పులుముతున్నారు. మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ఎన్నికైతే ఉమ్మడి పౌరస్మృతితో పాటు భారతదేశం మూడవ ఆర్థిక దేశంగా ఎదగడం ఖాయమనే భయంతో, అక్కసుతో కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు దేశ ప్రజలు బుద్ధి చెబుతారు.