Spot registration of vehicles in Telangana:  తెలంగాణలో వాహనదారుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆర్టీఓ  కార్యాలయాల నుంచి నేరుగా షోరూమ్‌లకే బదిలీ చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఇకపై వాహనదారులు తమ కొత్త బైక్ లేదా కారు రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం అటు సమయాన్ని, ఇటు శ్రమను ఆదా చేయడమే కాకుండా రవాణా శాఖలో పారదర్శకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.               

Continues below advertisement

అమలు విధానం ఎలా అంటే ?        

ఈ కొత్త విధానం ప్రకారం, వాహనం కొనుగోలు చేసిన సమయంలోనే షోరూమ్ డీలర్లు ఆన్‌లైన్ ద్వారా అవసరమైన పత్రాలను రవాణా శాఖకు సమర్పిస్తారు. షోరూమ్‌లోనే వాహనం యొక్క ఇంజిన్, ఛాసిస్ నంబర్లను అధికారులు ధృవీకరించేలా సాంకేతిక ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయింపు కూడా అక్కడే పూర్తవుతుంది. దీనివల్ల వాహనం షోరూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడే అధికారిక నంబర్ ప్లేట్‌తో వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో టెంపరరీ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆ తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం మళ్లీ ఆర్టీఓ ఆఫీసులో స్లాట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ తలనొప్పి ఉండదు.

Continues below advertisement

చాలా కాలంగా పెండింగ్ లో ప్రతిపాదన                                  

వాస్తవానికి ఈ ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉన్నప్పటికీ, తెలంగాణలో సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. గతంలో ఆర్టీఓ కార్యాలయాల్లో ఏజెంట్ల బెడద, అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని భావించిన ప్రస్తుత ప్రభుత్వం, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా షోరూమ్ స్థాయిలోనే ప్రక్రియ ముగిసేలా నిబంధనలను సవరించింది.

వాహనదారుల స్పందన                             

ప్రభుత్వ నిర్ణయంపై వాహనదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ కొత్త వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఒక రోజంతా సెలవు పెట్టి ఆర్టీఓ ఆఫీసులో వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడం పెద్ద ఊరటనిస్తోంది.  షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ కావడం వల్ల ఆర్టీఓ కార్యాలయాల వద్ద ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రజలకు సేవలను మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేసిన ఈ అడుగు రవాణా రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.