TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీ లీకేజీ వెనుక పాత్రధారి ఎవరు? సూత్రధారి ఎవరు? సిట్ ఎదుట లీకు వీరులు చెప్పిందేంటి? నిజం చెప్పారా. అబద్ధం చెప్పారా?  సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తే ఏమేం ఆధారాలు దొరికాయి. ఏమేం స్వాధీనం చేసుకున్నారు? కాన్ఫిడెన్షియల్ రూంలోకి ఎలా వెళ్లారు? లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఎలా సంపాదించారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.


TSPSCలో పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని సర్కారు సీరియస్‌గా తీసుకుంది! నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించవద్దని గట్టిగానే ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో సిట్‌ ముమ్మరంగా దర్యాప్తు చేపట్టింది. TSPSC కార్యాలయంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేసి రెండు కంప్యూటర్లని స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను పిన్ టు పిన్ అడుగుతూ నేరం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి కంప్యూటర్‌ను నిందితుల సమక్షంలో పరిశీలించారు. ఐపీ అడ్రస్‌లు మార్చి కంప్యూటర్‌లోకి ఎలా చొరబడ్డారని విషయాలను ఆరాతీశారు.


కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కంప్యూటర్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డులను శంకర్ లక్ష్మి డైరీ నుంచి దొంగిలించినట్లు ప్రవీణ్ సిట్ అధికారుల ముందు చెప్పాడు. అయితే డైరీలో ఎక్కడ కూడా లాగిన్ ఐడీ పాస్వర్డ్ రాయలేదని, ప్రవీణ్ చెప్పేది అబద్దమని శంకర్ లక్ష్మి పోలీసులకు తెలిపారు. సిట్ అధికారులు కూడా అధికారి చెప్పింది వాస్తవమే అని, ప్రవీణ్ అబద్దాలు చెబుతున్నాడని గ్రహించారు. రాజశేఖర్ రెడ్డి ఐపీ అడ్రసులు మార్చి కంప్యూటర్లోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు.


అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈ, డిఏఓ పరీక్ష ప్రశ్నాపత్రాలను ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి కలిసి లీక్ చేశారు. ఫిబ్రవరి 27 కంటే ముందునుంచే లీకేజీ వ్యవహారం నడిపించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.


TSPSC పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. 6 రోజుల పాటు 9మందిని సిట్ ప్రశ్నించబోతోంది. ఈనెల 23వరకు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు


తొమ్మిది మంది నిందితులు వీళ్లే


ఏ -1 ప్రవీణ్ కుమార్,


ఏ -2 అట్ల రాజశేఖర్


ఏ -3 రేణుక రాథోడ్


ఏ -4 డాక్య


ఏ- 5 కేతావత్ రాజేశ్వర్


ఏ -6 కేతావత్ నీలేష్ నాయక్


ఏ -7 పత్లావత్ గోపాల్ నాయక్


ఏ -8 కేతావత్ శ్రీనివాస్


ఏ -9 కేతావత్ రాజేంద్ర నాయక్.


ఇప్పటికే నిందితులపై సెక్షన్ 420, 409, 120B, IT యాక్ట్ 66 B,C : 70/IT యాక్ట్ సెక్షన్ 4 / తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిందితుల ఆర్థిక లావాదేవీలపైనా సిట్ కూపీలాగబోతోంది. ఎగ్జామ్ పేపర్లు ఎవరెవరికి అమ్మారు? ఎంతకు అమ్మారు? డబ్బులు ఏ రూపంలో అందాయి అనే విషయాలపై సిట్ సవివరంగా దర్యాప్తుచేయబోతోంది.


కమిషన్‌లో పనిచేసే ఇద్దరు చేసిన తప్పు వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి  మాత్రమే కాదు.. ఈ లీకేజీ వ్యవహారం వెనుక ఇంకా ఎవరున్నా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. రాజశేఖర్‌రెడ్డి బీజేపీ క్రియాశీల కార్యకర్త అని కేటీఆర్ ఆరోపించారు. ఏదైనా కుట్రకోణం ఉందా అని పరిశీలించాలని డీజీపీని కోరుతున్నామని చెప్పారు కేటీఆర్. సిట్ విచారణ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి, ముందే లేనిపోని అనుమానాలు సృష్టించవద్దన్నారు. త్వరలో వాస్తవాలన్నీ బయటకు వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు.