Siddipet Latest News: సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసు అధికారి పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం సిద్దిపేట జిల్లాలో కలకలం అయింది. ఈ విషయం తెలిసిన పోలీసు భార్య పలుమార్లు భర్తని అక్రమ సంబంధం మానేయాలని మందలించినా ఆయన వ్యవహారంలో మార్పు లేదు. దీంతో విసుగు చెందిన భార్య తన భర్త పని చేస్తున్న పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. బంధువులతో కలిసి ధర్నా నిర్వహించింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


కరీంనగర్ జిల్లా గోపాల్ పూర్ కు చెందిన ఎస్సై మేడిద నాగరాజుకు ఇదే గ్రామానికి చెందిన మానసకు పది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అంత సవ్యంగానే సాగిపోతోందనుకొనే సమయంలో గత కొంత కాలం నుండి భ‌ర్త వ్యవహార శైలిలో మార్పు క‌నిపించిందని.. తన భ‌ర్త వేరే మ‌హిళతో వివాహేత‌ర సంబంధంలో ఉన్నార‌ని గుర్తించినట్లుగా భార్య వెల్లడించింది. ఆ సంబంధం మానుకోవాల‌ని భ‌ర్తకు చెప్పి చూసినా అత‌డిలో మార్పు రాలేదని స్థానికులు తెలిపారు.


నాగరాజు సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మానస తన కుటుంబ సభ్యులతో కలిసి కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించింది. తనకు తన భర్త పిల్లలు కావాలని ఆందోళన చేసింది. తనపై లేనిపోని నిందలు వేసి అత్తమామలు తనను వేధిస్తున్నారని మానస ఆరోపణలు చేసింది. తన భర్త తన పిల్లలు తనకు కావాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని విలపించింది. ఎస్సై నాగరాజు గురించి పైఅధికారులకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని తనకు న్యాయం చేయాలని మానస డిమాండ్ చేసింది.