TS Congress :  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్న సీనియర్లు నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. బుధవారం   బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు జరగనున్నాయి. వీటికి హాజరుకావాలని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసమ్మతి నేతలకు ఫోన్ చేశారు. దీంతో సీనియర్ నేతలు   మీటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడే నేరుగా ఫోన్ చేసి అడిగినందున వెళ్లకపోతే బాగుండదన్న  అభిప్రాయంతో వారు ఉన్నారు. వారం రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు ఫోన్‌లో హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 


ఇటీవలే ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి అసమ్మతి నేతలతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ వర్గం నాయకులతో పాటు సీనియర్లతో వరుస భేటీలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే పార్టీలోనే చర్చించుకోవాలని... బహిరంగ విమర్శలు, కామెంట్స్ చేయొద్దన్నారు. అయితే రాష్ట్రంలో డిగ్గీ టూర్ తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. డిసెంబర్ లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు కూడా సీనియర్లెవరూ అటెండ్ కాలేదు. దిగ్విజయ్ సింగ్ ఓ నివేదికను పార్టీ హైకమాండ్ కు ఇచ్చారని చెబుతున్నారు. ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటారని సీనియర్లు కూడా ఎదురు చూస్తున్నారు. 



టీ పీసీసీ అధ్యక్షుడ్ని లేదా ..  తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిగం ఠాగూర్‌ను తొలగించాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని కూడా అంటున్నారు. అందరూ కలిసి పాదయాత్ర చేయాలని.. ఒక్క రేవంత్ మాత్రమే చేయకూడదని వారి వాదన. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రను ఇప్పటికే ప్రకటించారు. హాత్ సే హాత్ జోడో యాత్రగా దీనికి నామకరణం చేయగా..జనవరి 26 నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. అయితే పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఏయే ప్రాంతాల గుండా వెళ్లాలి. ఎక్కడ మీటింగ్ లు జరపాలి. ఎక్కడ ముగింపు సభ ఏర్పాటు చేయాలనే అంశాలపై టీపీసీసీ కసరత్తులు చేస్తుంది. టీపీసీసీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన భద్రాచలం నుండి ప్రారంభించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభతో ముగించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.


అయితే అసంతృప్త  సీనియర్ నేతలు మాత్రం  రేవంత్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు.  హత్ సే హత్ జోడోలో బ్లాకుల వారీగా పాదయాత్ర నిర్వహిస్తామని సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అభియాన్ ముగింపులో భాగంగా హైదరాబాద్‌లో జరిగే సభకు రాహుల్ గాంధీ వస్తారని ఆయన తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన సర్క్యూలర్‌లో 2 నెలల పాదయాత్ర అని వుందని.. కానీ జనవరి 26 నుంచి 5 నెలల పాటు పాదయాత్ర అన్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని ఏఐసీసీ వెల్లడించిందని చెబుతున్నారు. ఏది నిజమో కానీ.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు మరోసారి గందరగోళంలో పడ్డాయి.