Hyderabad to Sabarimala Special Buses: అయ్యప్ప భక్తులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి అయ్యప్ప దర్శనానికి శబరిమల (Sabirimala) వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్ సర్వీస్ (Special Bus service To Sabarimala) ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 5 (శుక్రవారం) నుంచి ఈ సర్వీసు ప్రారంభం కానుందని.. అయ్యప్ప భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా యాత్ర సాగించవచ్చని తెలిపింది. ఇటీవల అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి టైం, టికెట్ ధరలను ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్లేందుకు ఓ ప్రయాణికుడికి రూ.13,600 ధరగా నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ప్యాకేజీలో భాగంగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 5న 'లహరి' బస్సు ఎంజీబీఎస్ (MGBS) నుంచి బయలుదేరుతుందని వివరించారు.


యాత్ర షెడ్యూల్ ఇదే



  • బస్సు తొలి రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఎంజీబీఎస్ (MGBS) నుంచి బయలుదేరుతుంది.

  • 2వ రోజు రాత్రి 7:30 గంటలకు కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ వినాయకుని దర్శనం అనంతరం అదే రోజు రాత్రి 10:30 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.

  • 3వ రోజు ఉదయం 6:30 గంటలకు గురువాయూర్ చేరుకుంటారు. అక్కడ దర్శనాల అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరుతుంది.

  • 4వ రోజు రాత్రి 11:20 గంటలకు ఎరుమేలి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 8:10 గంటలకు ప్రారంభమవుతారు. 9:20 గంటలకు పంబకు చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 01:30 గంటలకు బయలుదేరుతుంది.

  • 5వ రోజు ఉదయం 5:20 గంటలకు తిరువనంతపురం చేరుకుని.. తిరిగి 9:20 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు మధురై చేరుకుని తిరిగి 11:20 గంటలకు బయలుదేరుతుంది.

  • 6వ రోజు ఉదయం 7:30 గంటలకు అరుణాచలం చేరుకుని.. అక్కడి నుంచి 3:30 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 6:10 గంటలకు కంచికి చేరుకుని, మరుసటి రోజు తెల్లవారుజామున 2:10 గంటలకు అకక్డి నుంచి బయలుదేరుతుంది.

  • 7వ రోజు ఉదయం 11:10 గంటలకు మహానంది చేరుకుంటుంది. అక్కడి నుంచి రాత్రి 11:30 గంటలకు బయలుదేరి బస్సు నేరుగా ఎంజీబీఎస్ చేరుకుంటుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.






సంక్రాంతికి ప్రత్యేక బస్సులు


మరోవైపు, సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి 4,484 ప్రత్యేక బస్సులను నడిపేలా టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 626 బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. భాగ్యనగరం నుంచి ఏపీకి రద్దీ దృష్ట్యా 1,450 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.


అద్దె బస్సులు యథాతథం


అటు, అద్దె బస్సుల యజమానులతోనూ ఆర్టీసీ యాజమాన్యం చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించకుంటే శుక్రవారం నుంచి సమ్మెకు వెళ్తామని అద్దె బస్సుల యజమానులు ప్రకటించడంతో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం వారితో సమావేశమయ్యారు. ఈ భేటీలో అద్దె బస్సుల యజమానుల సమస్యలను విన్న సజ్జనార్ వారం రోజుల్లో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందు కోసం ఓ కమిటీని వేస్తామని చెప్పారు. 2, 3 రోజుల్లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని సజ్జనార్ తెలిపారు. కాగా, 5 ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లినట్లు అద్దె బస్సుల యజమానులు తెలిపారు. ఈ నెల 10లోగా సమస్యలు పరిష్కరిస్తామని ఎండీ హామీ ఇచ్చారని చెప్పారు. దీంతో శుక్రవారం నుంచి తలపెట్టిన సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.


Also Read: Telangana News: అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలం - రేపటి నుంచి యథావిధిగా బస్సులు