Revanth Reddy Satires on KTR: బీఆర్ఎస్ పార్టీలో జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారని, ఈ మధ్య ఆయన ఆటోలు ఎక్కడి డ్రామాలు మొదలుపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పరోక్షంగా మాజీ కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఉండగా.. ఆటో వారిని బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఫ్రీ బస్సు పథకం వల్ల నష్టపోతున్నామని ఎవరైనా ఆటోను తగలబెట్టుకుంటారా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు.


బీఆర్ఎస్, బీజేపీ స్నేహంతో ఉన్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సొంత పార్టీ నేతలకు కూడా ముఖ్యమైన విషయాలు చెప్పరని.. బీఆర్ఎస్ నేతలకు అనుమానం ఉంటే తన దగ్గరకు వచ్చి కలిస్తే అన్ని వివరిస్తానని మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉండగా కొంత మంది మంత్రులు అవిశ్వాసం ప్రకటించి.. కేటీఆర్‌ను సీఎం చేయాలని చూశారని విమర్శించారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక కేసీఆర్ మోదీ దగ్గరకు వెళ్లి కేటీఆర్‌ను సీఎం చేస్తానని చెప్పారని అన్నారు. అందుకు అనుమతి కూడా కోరారని చెప్పారు. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మోదీ తీసుకువచ్చిన చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిన విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.


క్రిష్ణా నదీ జలాలు, ఆ నదిపై ఉన్న ప్రాజెక్టులు క్రిష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందన్న వాదనను రేవంత్ రెడ్డి ఖండించారు. 2014 నుంచి 23 వరకూ కేఆర్ఎంబీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ వెళ్లారని.. తాము ఇంత వరకూ ఏ సమావేశాలకు వెళ్లలేదని అన్నారు. ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటాన్న మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.