Revanth Fires On Kcr:  కృష్ణా జలాలు ఏపీ తరలించుకుపోతున్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  ఆనాడు వైఎస్ కు ఊడిగం చేసి కృష్ణా జలాలు సీమకు తరలించుకుపోయేందుకు సహకరించింది నువ్వు కాదా కెసిఆర్ అని ప్రశ్నించారు. నారాయణపేట  “ప్రజా పాలన- ప్రగతి బాట”బహిరంగ సభలో  ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.  వైఎస్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి ఆరు గంటల పాటు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల ద్వారా నీళ్లు  తరలించుకు పోతుంటే చూస్తూ ఊరుకుంది నువ్వు కాదా .. ఇది ద్రోహం కాదా అని రేవంత్ ప్రశ్నించారు. నువ్వు చేసిన పాపం ఇవాళ రాష్ట్రాన్ని వెంటాడుతుంది నిజం కాదా  పదేళ్లలో సాగునీటి మంత్రులుగా ఉన్నది హరీష్, కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు.  ఈ పాపం మీది కాకపోతే ఇంకెవరిదని  ప్రశ్నించారు.  నీళ్లు రాయలసీమ తరలించుకుపోతే.. నిధులు కెసిఆర్ కుటుంబం తరలించుకుపోయిందని మండిపడ్డారు. 

పదేళ్లలో పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు ? 

పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు ..  అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.  ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నామని..  పదేళ్లుగా పాలమూరు జిల్లా ఎందుకు నీళ్లు రాలేదు.. పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదని ప్రశఅనించారు.  పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను కెసిఆర్ ఎందుకు పూర్తి చేయలేదన్నారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పడావుపెట్టి కెసీఆర్ పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చారు .. మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు అనుమతి తెస్తే నా పై కోపంతో దాన్ని పడావు పెట్టారన్నారు.  పాలమూరు వలసలు ఆపేందుకు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నమేం ప్రయత్నిస్తుంటే…మమ్మల్ని అడ్డుకుంటున్నారని  విమర్శించారు. 

గట్టిగా కొట్టడానికి అది ఫుల్లా.. హాఫా ?  

బీజేపీ, బీఆరెస్ కు నేను సూటిగా సవాల్ విసురుతున్నా .. పన్నెండేళ్ల మోదీ పాలనపై, పదేళ్ల బీఆరెస్ పాలనపై, పన్నెండు నెలల మా పాలనపై చర్చకు మేం సిద్ధమని సవాల్ చేశారు.  బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రండి… బీఆరెస్ నుంచి కెసిఆర్ వస్తారో కొడుకును, అల్లుడిని పంపిస్తారో రండి.. ప్లేస్, డేట్ చెప్పండి చర్చకు నేను సిద్ధమన్నారు. గట్టిగా కొడతానని కేసీఆర్ అంటున్నారు.. అదేమైనా ఫుల్లా.. హాఫా అని ప్రశ్నించారు. కెసిఆర్ నువ్వు గట్టిగా కొట్టాలంటే నీ కొడుకును, నీ బిడ్డను, నీ అల్లుడిని కొట్టుకో ..  కాంగ్రెస్ ను కొడతామంటే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. 

ఇవిగో మేం చేసిన పనులు ! 

పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తానంటే నిన్ను ఎవరైనా వద్దన్నారా ... పన్నెండు నెలల్లో మేం ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారన్నారు.  మేం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువకులకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం .. మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాలలు అప్పగించి వారిని ప్రోత్సహిస్తున్నాం ..ఆర్టీసీలో మహిళకు 600 బస్సులను అప్పగించి వారిని ఓనర్లను చేశామన్నారు.  రూ.5వేల కోట్లతో కొడంగల్, వెయ్యి కోట్లతో నారాయణపేట అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని..  ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు.  బీఆర్ఎస్ కు సూటిగా సవాల్ విసురుతున్నా  ఏ ఊర్లో మేం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామో ఆ ఊర్లో మేం పోటీ చేస్తాం ..ఏ ఊర్లో మీరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో అక్కడే మీరు పోటీచేయాలన్నారు.  

తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ కాకుల్లా పొడుస్తున్నారు ! 

దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ కులగణన నిర్వహించామని.. ముప్ఫై ఏళ్లుగా పరిష్కారం కానీ ఎస్సీ ఉపకులాల సమస్యకు పరిష్కారం చూపామన్నారు.  ఇవన్నీ కెసిఆర్ కళ్లకు కనిపించడంలేదా అని ప్రశ్నించారు.  నల్లడబ్బు పేదల ఖాతాలో వేస్తామన్న మోదీ ఏం చేశారని ప్రశ్నించారు.  రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని వారిని మోసం చేశారని..  2022 లోగా ప్రతీ పేదవాడికి ఇళ్లు ఇస్తామన్నారు… ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు.  కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి తప్ప తెలంగాణలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేసినా తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ కాకుల్లా పొడుస్తున్నారని మండిపడ్డారు. వీళ్లకు సరైన జవాబు చెప్పే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదేనన్నారు.  

కుట్రలు చేస్తున్న వారికి బుద్ది చెప్పాలి !

పాలమూరు పచ్చగా కనబడితే వాళ్ల కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని..  మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్లు కండల్లో నిప్పులు పోసుకుంటున్నారు వాళ్ళ కడుపులు మండుతున్నాయ్ .. మీరు బాధపడొద్దు కన్నీరు పెట్టుకోవద్దు ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి పాలమూరును అభివృద్ధి చేసుకుందామన్నారు. కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని బయలుదేరి మనపై కుట్రలు చేస్తున్నారని..  వారికి మీరు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.