Telangana HYDRA Controversie:   హైదరాబాద్‌లోని చెరువులు, నాలాల పునరుద్ధరణే ధ్యేయంగా తీసుకొచ్చిన  హైడ్రా వ్యవస్థ, ఆ వ్యవస్థను నడుపుతున్న  రంగనాథ్ నియామకంపై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. భారీగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్న హైడ్రా కమిషనర్ ను తక్షణం బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మరో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. ఈ తీర్పుతో హైడ్రా గురించి బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. అయితే  ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రతిపక్షాల విమర్శలపై అత్యంత ఘాటుగా స్పందించారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలి, ఏ బాధ్యతలు అప్పగించాలనేది పూర్తిగా  ప్రభుత్వ విచక్షణాధికారం అని స్పష్టం చేసిన సీఎం.. హైడ్రా కమిషనర్‌ను తొలగించే ప్రసక్తే లేదని, ఈ అంశాన్ని న్యాయస్థానాల్లోనే చట్టబద్ధంగా ఎదుర్కొంటామని  సంకేతాలు ఇచ్చారు. 

Continues below advertisement

సోమేష్ కుమార్ ఉదంతం ఎత్తిచూపుతూ ఎదురుదాడి 

ఢిల్లీలో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును, అప్పటి అధికారుల వైఖరిని ఎండగట్టారు.  గతంలో సీఎస్ సోమేష్ కుమార్‌పై ఏకంగా 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నప్పుడు ఈ మేధావులు, ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడలేదు  అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన బడా బాబులే ఇప్పుడు వ్యవస్థలను, కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు నిష్పాక్షికంగా పనిచేస్తున్నప్పుడు వారి ధైర్యాన్ని దెబ్బతీసేలా రాజకీయ ప్రచారాలు చేయడం సరికాదని మండిపడ్డారు.

Continues below advertisement

 న్యాయపరమైన పోరాటం చేస్తాం 

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనుతాము గౌరవిస్తామని, తీర్పు కాపీని సమగ్రంగా పరిశీలించిన తర్వాత తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వివరించారు. అవసరమైతే ఉన్నత న్యాయస్థానాలను   ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోమని సూచనప్రాయంగా తెలిపారు. ప్రభుత్వానికి చెరువులు, నాలాలు కాపాడాలనే స్పష్టమైన సంకల్పం ఉందని, ఏ కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసమో హైడ్రా దూకుడును తగ్గించేది లేదని ఆయన పునరుద్ఘాటించారు.  

 రాజకీయంగా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ 

శాసనవ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య ఉన్న అధికారాల పరిధిపై రేవంత్ రెడ్డి లేవనెత్తిన  విచక్షణాధికారం అనే పాయింట్‌పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కోర్టు హెచ్చరికలు, ప్రతిపక్షాల విమర్శలు ఎన్ని వస్తున్నప్పటికీ హైడ్రా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో అధికారులు మరింత ఉత్సాహంతో పని చేసే అవకాశం కనిపిస్తోంది. ఆక్రమణదారులకు చట్టబద్ధంగా నోటీసులు ఇస్తూనే, రాబోయే రోజుల్లో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ ను తొలగించే అవకాశంలేదని రేవంత్ సంకేతాలివ్వడమే దీనికి కారణం.