Revant On BRS :   తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్రసమితిగా మారుస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం.. కోర్టు ధిక్కరణకు పాల్పడటమేనని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ గులాబీ కూలీ, అవినీతిపై ఢిల్లీ హై కోర్టులో 12వ తేదీన విచారణ ఉందని.. ఈ లోపే టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.  బీజేపీ సూచనలతోనే ఎన్నికల కమిషన్.. టీఆర్ఎస్‌కి సహకరించిందన్నారు. కోర్టు ధిక్కరణకి పాల్పడ్డ కేంద్ర ఎన్నికల కమిషన్‌పై లీగల్ ఫైట్ చేస్తామన్నారు.  


కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చేందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రకటన 


ఓట్లను చీల్చేందుకే బీజేపీ టీఆర్ఎస్ ను వాడుకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అక్రమాలపై, బంగారు కూలీపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బంగారు కూలీ పేరుతో వందల కోట్లు వసూల్ చేసిన పార్టీ ఆ లెక్కలు ఎక్కడా చూపించలేదని అన్నారు. 2017లో గులాబీ కూలీ పేరుతో టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు అవినీతికి పాల్పడ్డారని రేవంత్‌రెడ్డి.. కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, ఏసీబీలకు ఫిర్యాదు చేశారు. గులాబీ కూలీ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పలు రకాల దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసిన తర్వాత... ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 


కేసీఆర్‌కు తెలంగాణతో  పేరు బంధం కూడా తెగిపోయిందన్న రేవంత్ 


కేసీఆర్ కు ఏనాడూ తెలంగాణతో పేగు బంధంలేదని, టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మారడంతో పేరు బంధం కూడా లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చడంపై ఎలక్షన్ కమిషన్ అభ్యంతరాలు చెప్పాలని అడిగిందని, అయితే తాను సీఈసీని కలిసేందుకు వెళ్తే కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని రేవంత్ వాపోయారు. పీసీసీ చీఫ్, ఎంపీగా ఉన్న తనను కలిసేందుకు సీఈఓకు వీలుపడలేదని విమర్శించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి బీఆర్ఎస్ గా మార్చిదని, కేసు పెండింగ్ లో ఉన్నందున పేరు మార్చేందుకు వీల్లేదని అన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశానని రేవంత్  తెలిపారు. 


వైసీపీతో కలిసి ఏపీ, తెలంగాణ  కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ 


మరో వైపు సమైక్య రాష్ట్రంపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా రేవంత్ స్పందించారు.  కేసీఆర్ ఏపీ, తెలంగాణను తిరిగి కలిపే ప్రయత్నం చేస్తున్నాడని  ఆరోపించారు. రెండు రాష్ట్రాలను కలిపే విషయంలో గురువారం సజ్జల మాట్లాడిన మాటల్ని తేలితగా తీసుకోవద్దన్నారు.  సజ్జల కామెంట్స్ ను టీఆర్ఎస్ నేతలు కనీసం ఖండించలేదంటేనే అర్థం చేసుకోవాలని అన్నారు. సజ్జల మాటల వెనుక కేసీఆర్ ప్రమేయం ఉందని విమర్శించారు. ఏపీ, తెలంగాణ తిరిగి కలిసిపోతే రెండు రాష్ట్రాల్లో పోటీ చేయొచ్చని కేసీఆర్ భావిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.