Raja Singh: రాజాసింగ్ రివర్స్ గేర్ - ఆవేశంతో బీజేపీ రాజీనామా.. అనివార్యంతో రీ-ఎంట్రీ!
Goshamahal MLA: బీజేపీ వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ బీజేపీలో చేరనున్నారు. కఠిన షరతులతో హైకమాండ్ చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Raja Singh to joins BJP: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఒక విచిత్రమైన మలుపు తిరిగింది. ఆవేశంతో పార్టీకి దూరమై, ఇప్పుడు మళ్లీ అదే గూటికి చేరేందుకు అతి కష్టం మీద అనుమతి తెచ్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అధ్యక్ష పదవి రగడ - ఆవేశం తెచ్చిన ముప్పు
గత ఏడాది తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు రాజాసింగ్ రాజకీయ జీవితంలో పెను ప్రకంపనలు సృష్టించాయి. ఎన్. రామచందర్ రావును అధ్యక్షుడిగా ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ, పాతబస్తీ శైలిలో రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం విమర్శలతో ఆగకుండా, తాను కూడా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తానని పట్టుబట్టారు. అయితే, నిబంధనల ప్రకారం కనీసం 10 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్ల మద్దతు లేకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో అవమానంగా భావించిన రాజాసింగ్, ఆవేశంతో తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ఊహించని విధంగా, పార్టీ అధిష్టానం కూడా ఎటువంటి బుజ్జగింపులు లేకుండా తక్షణమే ఆ రాజీనామాను ఆమోదించి షాక్ ఇచ్చింది.
రాజకీయ శూన్యత - ఇతర పార్టీల్లో నో ఎంట్రీ
బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజాసింగ్ ఒక రకమైన రాజకీయ శూన్యతను ఎదుర్కొన్నారు. ఆయనకున్న హిందుత్వ ఇమేజ్ కారణంగా అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీఆర్ఎస్ గానీ ఆయనను చేర్చుకోవడానికి ఆసక్తి చూపలేదు. తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ, ఒంటరి పోరాటం చేయడం లేదా స్వతంత్రుడిగా మిగిలిపోవడం వల్ల రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన గ్రహించారు. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరాలి అన్న సామెత చందంగా, ఇతర పార్టీల నుంచి సానుకూల స్పందన లేకపోవడం, సొంత కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఆయన మళ్లీ బీజేపీ వైపు చూడక తప్పలేదు.
అధిష్టానం షరతులు
ప్రస్తుతం రాజాసింగ్ బీజేపీలోకి మళ్లీ రాబోతున్నారనే వార్తలకు గ్రీన్ సిగ్నల్ రావడం వెనుక భారీ కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా పార్టీ లైన్ దాటి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదని, క్రమశిక్షణ తప్పకూడదని అధిష్టానం గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ పెద్దల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే రాష్ట్ర నాయకత్వం ఆయనకు మార్గం సుగమం చేసింది. పాతబస్తీలో బీజేపీ జెండా ఎగరాలంటే రాజాసింగ్ వంటి బలమైన వాయిస్ అవసరమని గుర్తించిన హైకమాండ్, ఈసారి ఆయనను ఒక లిమిటెడ్ ఫ్రేమ్ లో ఉంచాలని నిర్ణయించుకుందని చెబుతున్నారు.
కానీ రాజాసింగ్ మారుతారా?
ఈ రీ-ఎంట్రీ రాజాసింగ్కు ఒక రకమైన రాజకీయ పునర్జన్మ వంటిదే. పార్టీలో తన పట్టును నిరూపించుకోవాలంటే గతంలో చేసిన ఆవేశపూరిత పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవడం ఆయనకు అతిపెద్ద సవాలు. అటు బీజేపీకి కూడా రాబోయే మున్సిపల్, లోకల్ బాడీ ఎన్నికల్లో రాజాసింగ్ దూకుడు అవసరం. రాజాసింగ్-బీజేపీ బంధం రెండో ఇన్నింగ్స్కు సిద్ధమైంది. ఈసారి రాజాసింగ్ తన టైగర్ ఇమేజ్ను కాపాడుకుంటూనే పార్టీకి ఎలా విధేయుడిగా ఉంటారో వేచి చూడాలి.
ట్రెండింగ్ వార్తలు























