Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు, క్లౌడ్ బరస్ట్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర ఒడిశాకు అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతం పశ్చిమ బెంగాల్ తీరం, ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల పైన విస్తరించి ఉంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు సౌరాష్ట్ర తీరంలోని ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా అల్పపీడన కేంద్రం, దీసా, రైసెన్, అంబికాపూర్, ఉత్తర ఒడిశా దాని పొరుగున అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా వెళుతుంది. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల పై వరకు విస్తరించి ఉంది. ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు సైతం వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలోనూ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నేడు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయి. వరద నీటితో గోదావరి ప్రాంతాలు చాలా వరకు నీట మునిగాయి. 






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ అల్పపీడనం ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. సీమ జిల్లాలైన చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి  వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రాంతాలకు ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు.


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.





తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి.  నేడు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.