Telangana News: ‘‘ఒక పన్ను పాడైతే మిగతా అన్ని పళ్లు పీకేసుకుంటామా? ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారా? ముఖ్యమంత్రి భాషపై కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తప్పు’’ అని తెలంగాణ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం (మార్చి 13) అన్నారు. కేసీఆర్ చెప్పినట్లుగా పాడైంది పన్ను అయితే బాగుండేదని పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. కానీ కేసిఆర్ అవినీతికి బలైంది కాళేశ్వరానికి వెన్నెముకలాంటి మేడిగడ్డ అని అన్నారు. మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ కూడా అంతే ముఖ్యమని అన్నారు. వెన్నెముక విరిగిపోతే శరీరం ఎలా ఉంటుందో ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి కూడా అలాగే ఉందని పొంగులేటి అన్నారు. 


ఎత్తిపోతల, తిప్పిపోతల అంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ వెన్నెముక అయిన మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 22 పిల్లర్లలో దాదాపు 7 పిల్లర్లు 3 ఫీట్ల మేరకు కుంగిపోయాయని అన్నారు. ఈ విషయాన్ని ఎన్ఎస్డీఏ, కేంద్ర ప్రభుత్వ జల వనరుల నిపుణులు, మన ప్రభుత్వ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారులు, మేధావులు, రైతు సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు, వివిధ పత్రికల ఎడిటర్లు, జర్నలిస్ట్ లు ఇలా ప్రజలు అందరూ ఏకరువు పెడుతున్నారని అన్నారు. అపర మేధావి కేసీఆర్ సమస్యను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.


ప్రజలు అత్యాశకు పోయారని ప్రజాతీర్పును కేసీఆర్ చులకన చేస్తున్నారని, తనకు ఓటు వేసినంత కాలం ప్రజలు మంచివారు, వ్యతిరేకంగా ఓటు  వేస్తే మాత్రం ప్రజలకు తెలివి లేదు మూర్ఖులు అన్నట్లుగా కేసిఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును ఆమోదిస్తున్నామని ఈరోజు వరకు కేసీఆర్ నోటినుండి వెలువడిందా?  ప్రజా తీర్పును ప్రశ్నించేలా కేసీఆర్ మాట్లాడడం ఎంత వరకు సమంజసం ? కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను కాపీ చేసి 400కు సిలిండర్ ఇస్తానంటే కూడా కేసీఆర్ హామీలను ప్రజలు నమ్మలేదని పొంగులేటి అన్నారు.


మేడిగడ్డ తర్వాత అన్నారం సుందిళ్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని పొంగులేటి అన్నారు. కేసీఆర్ అవినీతి జబ్బు ఒక మేడిగడ్డకే పరిమితం కాలేదని.. అన్నారం సుందిళ్ళకు కూడా పాకిందని అన్నారు.  తానే ఇంజనీర్, తానే డిజైనర్, తానే  తాపీ మేస్త్రి అనే విధంగా వ్యవహరించారని కాళేశ్వరం కెసిఆర్ అవినీతి అహంకారానికి మూర్ఖత్వానికి నిదర్శనం అని విమర్శించారు.  


‘‘మేడిగడ్డ బ్యారేజీ తర్వాత అన్నారం బ్యారేజీ, సుందిళ్ల ప్రాజెక్టుల పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. కేసీఆర్ అవినీతి జబ్బు ఒక మేడిగడ్డకే పరిమితం కాలేదు. ఆ జబ్బు అన్నారం సుందిళ్ళకు కూడా పాకింది. తానే ఇంజనీర్, తానే డిజైనర్, తానే తాపీ మేస్త్రి అనే విధంగా వ్యవహరించారు. కాళేశ్వరం కేసీఆర్ అవినీతి అహంకారానికి మూర్ఖత్వానికి నిదర్శనం’’ అని పొంగులేటి విమర్శించారు.  


శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలు పాల్గొనకుండా పారిపోయిన పెద్దమనిషి 80వేల పుస్తకాలు చదివిన మేధావి కాళేశ్వరం రూపశిల్పి ఇప్పుడు టీవీల ముందుకు వచ్చి మాట్లాడుతారంట అని ఎద్దేవా చేశారు. భూమి ఆకాశం ఉన్నన్నిరోజులు బీఆర్ఎస్ ఉంటుందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. టీఆర్ఎస్ స్థానంలో కెసిఆర్ ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసని, దేశంలో గత్తెర లేప్త భూకంపం సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో పోటీ చేయలేక చేతులెత్తేయగా, ఉన్న రాష్ట్రంలో ప్రజలు కెసిఆర్ కుర్చీ మడత పెట్టారని, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా బీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కేసిఆర్  పాలనలో జరిగిన పాలనపరమైన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కరువుకు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా ? మా ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీన ఏర్పడిందని, అప్పటికే వర్షాకాలం సీజన్ ముగిసిందనే  విషయాన్ని కేసిఆర్ గుర్తుంచుకోవాలని పొంగులేటి అన్నారు.