కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలపాతాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. యువత వాటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ప్రకృతి విహారాని వెళ్తున్న వారు కనీస జాగ్రత్తలు తీసుకోకపోతుండడంతో మృత్యువాత పడుతున్నారు. జలపాతాల వద్దకు ఎవరూ రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ములుగు జిల్లాలో చేపల కోసం వెళ్లి మృత్యువాత పడిన ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. సబితం జలపాతం చూడటానికి వచ్చిన ఓ విద్యార్థి అందులో పడి మరణించాడు. 






కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్‌కు చెందిన మానుపాటి వెంకటేష్ (23)స్నేహితులతో కలిసి మంగళవారం సబితం వాటర్ ఫాల్స్ సందర్శనకు వచ్చాడు. ప్రకృతిని ఆస్వాదిస్తూ రాళ్లపై నుంచి జారి పడి మృతి చెందాడు. స్థానికులు, రెస్క్యూ టీం తీవ్రంగా గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. అధికారుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేయడంతో ప్రమాదం జరిగినట్లు పర్యాటకులు చెబుతున్నారు.


నీటి ప్రవాహం అధికంగా ఉందని ఎవరు సందర్శనకు రావద్దని ఎన్ని మార్లు విన్నవించిన పర్యాటకులు పట్టించుకోవడం లేదని పోలీసు చెబుతున్నారు. భద్రత గురించి ఎంత చెప్పినా వినడం లేదని అంటున్నారు. వాటర్ ఫాల్స్ దగ్గరకు రావొద్దని చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారని చెబుతున్నారు. ఏదైనా విహార యాత్రకు వెళ్లినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. విహారయాత్ర విషాద యాత్ర కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. 


ములుగు జిల్లాలో అడవిలో చిక్కుకున్న 84 మంది
ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. ముత్యంధార జలపాతం చూసేందుకు 84 మంది పర్యాటకులు బుధవారం అటవీ ప్రాంతానికి వచ్చారు. హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల నుంచి 12 కార్లు, 10ద్విచక్ర వాహనాలపై నుంచి పర్యాటకులు బొగత జలపాతాన్ని చూసేందుకు వచ్చారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగడంతో వారంతా అడవిలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌‌లకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు అధికారులు ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. పోలీసులు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో గురువారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో పర్యాటకులను అడవిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. పర్యాటకులు అందరూ క్షేమంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.


చేపలకు వెళ్లి వ్యక్తి గల్లంతు
ఇటీవలే ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వాగులో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. భోదాపురం పంచాయతీ సీతారాంపురం గ్రామానికి చెందిన బొగ్గుల బండయ్య(70) గ్రామం సమీపంలోని పెదవాగులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో గాలం ( చేపలు పట్టే పరికరం) వాగులో తట్టుకుంది. దీంతో ప్రవహిస్తున్న వాగులోకి బండయ్య దిగాడు. వాగు వేగంగా ప్రవహించడంతో ఒక్కసారిగా అదుపుతప్పి వాగులో మునిగి గల్లంతయ్యాడు.