తాను దరఖాస్తు చేయకపోయినా TSPSC గ్రూప్ 1 హాల్ టికెట్ జారీ అయిందన్న విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కానీ మొత్తానికి టీఎస్ పీఎస్సీ చెప్పిందని నిజమని తేలింది. తాను గతంలో గ్రూప్ 1 కు దరఖాస్తు చేశాను, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆ విషయాన్ని మరిచిపోయాను అని అభ్యర్థి జక్కుల సుచిత్ర తెలిపింది. తాను చేసిన వ్యాఖ్యలపై టీఎస్ పీఎస్సీకి క్షమాపణ చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వైరల్ చేశారని, తాను దరఖాస్తు చేయడం వాస్తవమేనని క్లారిటీ ఇచ్చింది.


TS1201206420తో నిజామాబాద్‌కు చెందిన జక్కుల సుచిత్ర అక్టోబర్‌ 16న ప్రిలిమ్స్ రాశారని, అటెండెన్స్ షీట్ లో సంతకం చేశారని టీఎస్ పీఎస్సీ సోమవారం పేర్కొంది. దరఖాస్తు చేయనివారికి హాల్ టికెట్ జారీ చేయడం అనేది జరగదని స్పష్టం చేసింది. ఈ విషయాలు సైతం మీడియాలో వైరల్ కావడంతో సుచిత్ర స్పందించింది. గత ఏడాది నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు ముందు తమ కుటుంబం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. ఎగ్జామ్ కు వచ్చేముందు ఫ్యామిలీ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైందని వెల్లడించింది. పరీక్ష రాసినా, ఆ తరువాత హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోయిందని గుర్తుచేసుకుంది. ఎగ్జామ్ కు కొన్ని రోజుల ముందు నలుగురు బంధువులు చనిపోయారని వాపోయింది. కనుక తనకు ఎగ్జామ్ రాసినట్లు అంతగా గుర్తులేదని, తాజాగా జరిగిన ఎగ్జామ్ రాయలేదని చెప్పింది. 


అప్లై చేయకుండానే గ్రూప్ 1 హాల్ టికెట్ అని ప్రచారం..
అప్లై చేయకపోయినా ఓ అభ్యర్థికి టీఎస్ పీఎస్సీ గ్రూప్-1 హాల్ టికెట్ జారీ చేసిందని.. అయితే ఈ విషయం గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజు కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన సుచిత్ర అనే యువతికి టీఎస్ పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ జారీ చేసింది. అయితే తాను గ్రూప్ 1కు అప్లై చేయలేదని, కేవలం గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు మాత్రమే దరఖాస్తు చేసినట్లు తెలిపారు. కానీ తనకు కూడా హాల్ టికెట్ రావడం గమనార్హం. హాట్ టికెట్ వచ్చినందుకు సంతోషించినా, ఎగ్జామ్ సెంటర్ కు వెళితే తనకు ఓఎంఆర్ కేటాయించారో లేదోనని తన కూతురు ఎగ్జామ్ రాయలేదని ఆమె తండ్రి శ్రీధర్ చెబుతున్నారు. తాను అప్లై చేయకపోయినా, హాల్ టికెట్ జారీ చేశారోనని సుచిత్ర కొంచె ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఉద్యోగ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహిస్తున్నామని చెప్పే టీఎస్ పీఎస్సీ వరుస తప్పిదాలు చేస్తుందని విమర్శలు మళ్లీ మొదలయ్యాయి.


సిద్దిపేటలో అభ్యర్థి అరెస్ట్..
ఇదివరకే గ్రూప్ 1 తో పాటు పలు ఉద్యోగ నియామకాల పరీక్షలు పేపర్ లీకేజీల కారణంగా రద్దయ్యాయి. కొన్ని ఎగ్జామ్స్ నిర్వహణకు ముందే వాయిదా వేసింది టీఎస్ పీఎస్సీ. కానీ, సిద్దిపేటలో పరీక్ష ప్రారంభానికి ముందే కేంద్రం నుంచి బయటకు వచ్చిన నిర్వాకానికి ప్రశాంత్ అనే అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఓఎంఆర్ షీట్‌లో హాల్‌ టికెట్ నంబర్ తప్పుగా రాసిన అభ్యర్థి.. పరీక్ష మంచిగా రాసినా వృథా అని భావించి బయటకు వచ్చేశాడు. పరీక్ష కేంద్రం బయటకు వచ్చిన కొంత సమయానికే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రశాంత్‌పై మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశారు.