నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఊపు మీదుండేది. రాను రాను పార్టీ పరిస్థితి దిగజారుతూ వస్తోంది. ధర్మపురి శ్రీనివాస్ డీఎస్ లాంటి నేతలు ఏక చత్రాధిపత్యం వహించిన జిల్లా ఇందూరు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఒకే జిల్లా నుంచి టీపీసీలో ముగ్గురు నేతలకు కీలక పదవులు అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఇప్పుడు జిల్లాకు ఆ ముగ్గురు నేతలు పెద్ద దిక్కు. సదరు నేతలు ఇప్పుడు తలాదోరిలో నడుస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు అతిథి పాత్రకు పరిమితం అవుతున్నారని అంటున్నారు. ముగ్గురు అగ్రనేతలుగా పార్టీలో గుర్తింపు ఉన్నా... ఒకరంటే ఒకరికి పడటం లేదంట. ఆ ముగ్గురు కలిసి ఏ ఒక్క కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తేవాల్సింది పోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్నారంట.

 

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌కు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ, సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు పెద్ద దిక్కు. టీ-పీసీసీ సైతం ఈ ముగ్గురు నేతలకు కీలక పదవులు కట్టబెట్టి తగిన గుర్తింపునిచ్చింది. మధుయాష్కీ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించిన కాంగ్రెస్ పార్టీ. మహేష్ కుమార్ గౌడ్‌కు వర్కింగ్ ప్రసిడెంట్‌గా అవకాశం ఇచ్చింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన సుదర్శన్ రెడ్డికి తొలిసారిగా పీసీసీ కోశాధికారిగా పార్టీ పదవి కట్టబెట్టారు. ఇలా ఒకే జిల్లా నుంచి మూడు కీలక పదవుల్లో ఉన్న సదరు నేతలు తలోదారిలో నడుస్తున్నారని జిల్లా పార్టీలో టాక్.

 

పార్టీ పటిష్టతకు కలిసి పని చేయాల్సిన ముగ్గురు నేతలు కలిసేందుకు నసేమిరా అంటున్నారట. ఈ ముగ్గురు నేతల మధ్య ఈగోతో పార్టీ కార్యక్రమాలను సైతం లైట్ తీసుకుంటున్నరనే ప్రచారం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా నడుస్తోంది. ముగ్గురి మధ్య విబేధాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నా... ఆ విబేధాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నారని తెలుస్తోంది. 

 

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. తెలంగాణకు ముందు రెండుసార్లు ఆ పార్టీ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికీ క్యాడర్ బలంగా ఉన్నా... లీడర్లలో అనైక్యత... నాయకుల మధ్య సఖ్యత లేని కారణంగా పార్టీ బలహీన పడుతోంది. చాలా నియోజకవర్గాలకు ఇంచార్జీలను సైతం నియమించలేని పరిస్థితిలో పార్టీ నేతలు ఉన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో అదిష్ఠానం ఇచ్చే కార్యక్రమాలకు ఆ ముగ్గురు కీలక నేతలు కీలకంగా వ్యవహారించడం లేదని క్యాడర్ గుర్రుగా ఉన్నారట.

 

మధుయాష్కీ వరుసగా రెండు సార్లు ఎంపీగా ఓటమి పాలయ్యాక నియోజకవర్గానికి చుట్టుపు చూపులా వచ్చిపోతున్నారనే టాక్ ఉంది. సభ్యత్వ నమోదులో యాక్టివ్ రోల్ పోషించలేదట. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ అతిథి పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్  గాంధీ భవన్‌కే పరిమితమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు ఉంటున్నారనే... ప్రచారం  జిల్లాలో జోరుగా నడుస్తోంది. రచ్చబండ కార్యక్రమాన్ని కీలకంగా తీసుకుని రచ్చ చేయాల్సిన సదరు నేతలు మౌనంగా ఉన్నారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయ్.

 

టీపీసీసీ కోశాధికారిగా బాధ్యతలో ఉన్నమాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తన నియోజకవర్గం బోధన్‌కు పరిమితం అవుతున్నారానే చర్చ జరుగుతోంది. డీఎస్ కాంగ్రెస్ పార్టీని విడిన తర్వాత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా మారారు. ఉన్నత పదవుల్లో ఉండి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమన్వయం చేసి పార్టీ పటిష్ఠతకు కృషి చేయాల్సిన తరుణంలో ముగ్గురు నేతల పనతీరు ఎవరికివారు అన్నచందంగా మారిందంటున్నారు కాంగ్రెస్ కేడర్.

 

మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు కాంగ్రెస్ సెకండ్ కేడర్. గతంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలతో నేతల మధ్య ఇంకా వైరం కొనసాగుతుందంటున్నారు. ఈ ముగ్గురు నేతల మధ్య లోపించిన సఖ్యతతో కాంగ్రెస్ కేడర్ అయోమయంలో పడింది. ఈ ముగ్గురూ టీపీసీసీలో కీలకంగా ఉన్నారు. ఎవరు ఎవరితో వెళ్లినా ఇబ్బందులు తప్పవని ఏటూ పాలుపోలేని స్థితిలో కేడర్ గందరగోళంలో ఉన్నారని తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతలు కలిసికట్టుగా ఉండి కేడర్‌ను ముందుకు తీసుకెళ్లి పార్టీని జిల్లాలో బలోపేతం చేయాల్సింది పోయి... వారి మధ్య ఈగోలతో దూరం దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. వీరి మధ్య హైకమాండ్ సఖ్యత కుదిర్చి జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా వేళ్లాల్సిన అవసరం ఉందంటున్నారు జిల్లా కాంగ్రెస్ నాయకులు.