Vivek Venkatswamy: క్యాతనపల్లిలో టెన్షన్ టెన్షన్.. మంత్రి వివేక్ వెంకటస్వామి వాహనంపై ఆందోళనకారుల రాళ్లదాడి
Kyathanpally Municipality | మంచిర్యాల జిల్లాలో క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. మంత్రి వివేక్ వాహనంపై రాళ్ల దాడి జరిగింది.

క్యాతనపల్లి: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రయాణిస్తున్న వాహనంపై బీఆర్ఎస్ ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో మంత్రి వాహనం అద్దం స్వల్పంగా దెబ్బతింది. ఈ దాడితో ఒక్కసారిగా అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ప్రజాప్రతినిధులపై ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు, క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికకు వెళ్తున్న బిఆర్ఎస్ (BRS) నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవ లక్ష్మిలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇతర బీఆర్ఎస్ శ్రేణులు క్యాతనపల్లి ఫ్లైఓవర్ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రి వివేక్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక కావడంతో మున్సిపల్ ఆఫీసుకు ఇరుపార్టీల కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో సెక్షన్ 163 బీఎన్ఎస్ యాక్ట్ అమలు
మంచిర్యాల జోన్ పరిధిలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఫిబ్రవరి 17 నుంచి 18వ తేదీ సాయంత్రం 08:00 వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ యాక్ట్ అమల్లో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ ఆంక్షల సమయంలో నలుగురికి మించి గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధమన్నారు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఉద్రిక్తం చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలు, గొడవలకు దారితీసే ప్రవర్తన ఏదైనా చోటుచేసుకున్నట్లయితే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, అటవీ అధికారులు, కేంద్ర బలగాలు, హోంగార్డులు, ఎస్పీఓలకు ఈ నిషేధాలు వర్తించవని స్పష్టం చేశారు.
చట్టపరమైన అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని పోలీసులు హెచ్చరించారు. కర్రలు, కత్తులు, తుపాకులు లేదా ఎలాంటి మారణాయుధాలతో సంచరించినా చట్టప్రకారం చర్యటుల తీసుకుంటామని సీపీ తెలిపారు. మైకులు, లౌడ్స్పీకర్ల ద్వారా పాటలు ప్రసారం చేయడం, సభలు నిర్వహించడం, ప్రజలను ఒక వర్గం మీద మరొక వర్గం మీద రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం నిషేధమని పేర్కొన్నారు. 163 బి.ఎన్.ఎస్ సెక్షన్ అమలు సమయంలో అధికారాన్ని ధిక్కరించే విధమైన ప్రకటనలు, ప్లకార్డులు, గుర్తులు ప్రదర్శించడం కూడా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
























