Telangana Municipal Elections 2026: నివాసం నుంచి నడుచుకుంటూ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి
Vivek Venkataswamy Casts Vote in Mancherial | తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీలో ఓటు వేశారు. ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మంచిర్యాల: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 227వ నంబర్ పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు మంత్రి తన నివాసం నుంచి సాధారణ పౌరుడిలా నడుచుకుంటూ వెళ్లడం విశేషం.
ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 85 శాతం స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం సాగుతోందని, అందుకే మున్సిపల్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, ఎలాంటి ఒత్తిడి లేని స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో భయపెట్టి ఏకగ్రీవాలు..
గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. బీఆర్ఎస్ హయాంలో పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడి, ప్రజాస్వామ్యాన్ని హరించి ఏకగ్రీవాలు చేయించుకున్న ఘటనలు ఉన్నాయని మంత్రి వివేక్ వెంకట్ స్వామి ఆరోపించారు.

కానీ ఇప్పుడు ఎక్కడా పోలీసుల ఒత్తిడి లేదని, ప్రజలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తోందని వివరించారు.

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజారంజక పథకాల పట్ల ప్రజలంతా పూర్తి సంతృప్తితో ఉన్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 85 శాతానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. చివరగా, స్థానిక సంస్థల బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం.. పోలింగ్ కేంద్రాలకు క్యూ
తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 2,981 స్థానాలకు గానూ 12,944 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే కొన్ని వార్డులు, డివిజన్లు ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట్ల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడంతో పాటు 163 సెక్షన్ అమలు చేస్తున్నారు.
ఓటర్ స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోండి..
ఎన్నికల సంఘం రూపొందించిన టీ-పోల్ యాప్ ద్వారా ఓటర్లు తమ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం పోలింగ్ ప్రాంతాల్లో పెయిడ్ హాలిడే ప్రకటించింది. ఓటు హక్కు వినియోగం కోసం అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. స్థానిక పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ పోలింగ్ ఫలితాలు ఈ నెల 13న వెలువడనున్నాయి. అనంతరం 16న మేయర్లు, ఛైర్మన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఓటు పట్టణాల అభివృద్ధికి కీలకమని అధికారులు, నేతలు ఓటర్లకు సూచిస్తున్నారు.
























