Telangana Deputy CM Bhatti Vikramarka | నిర్మల్: బీజేపీ మరోసారి ఎన్నికల్లో నెగ్గి, ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొడతారని కాషాయ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే ఈసారి ఓటమి ఖాయమని భావించి ప్రధాని మోడీ దేశంలో మత వైశమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క ఆరోపించారు. ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలంటే ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ సమావేశానికి పార్టీ తెలంగాణ ఇంచార్జి దీపాదాస్ మున్షీ తో కలిసి భట్టి హాజరయ్యారు. 


ఆత్రం సుగుణను గెలిపించాలని పిలుపు 
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ విజయానికి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మే 13న పోలింగ్ అని, ఈ నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ నిర్వహించాలన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బిజెపికి ఓటు వేస్తే మన హక్కులు పోతాయన్నారు. ప్రజాస్వామ్య  పరిరక్షణకు దేశ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న మోదీ ఒకవైపు ఉంటే, లౌకికవాదాన్ని నిలబెట్టాలనుకున్న రాహుల్ గాంధీ మరో వైపు ఉన్నారని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేస్తున్న మోడీకి బుద్ధి చెప్పాలన్నారు. 




ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులు, దేశ సంపద, మనకే ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని ప్రజలకు భట్టి విజ్ఞప్తి చేశారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు ఒకటేనని మరోసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రుజువైందన్నారు. బిఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని, కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలకు బిఆర్ఎస్ ఎంపీలు మద్దతి ఇచ్చినట్లు గుర్తు చేశారు. బిఆర్ఎస్ బలమున్నచోట బిజెపి బలహీనమైన అభ్యర్థిని.. బిజెపి అభ్యర్థి బలమున్న చోట బిఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థిని పెట్టాయని ఆరోపించారు. 


‘బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రైతుల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాయి. రైతు భరోసా రాకుండా రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయి. రైతు భరోసా విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు.  ఓబిసి కులగణన ద్వారా దేశ సంపద జనాభా దమాషా ప్రకారం వారికి వాటా లభిస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ బిజెపి పెద్దలకు చెబితే పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా దమాష ప్రకారంగా హక్కులు, సంపద కల్పిస్తామని’ భట్టి విక్రమార్క వెల్లడించారు


బీఆర్ఎస్ 10 ఏళ్లు మోసం చేసింది
బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్నా సాగు నీళ్ళు ఇవ్వకుండా ఆదిలాబాద్ ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాణహితను విస్మరించి కాలేశ్వరం నిర్మించి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కష్టాలను చూపించిందని ఆరోపించారు. ఎన్నికల తర్వాత ప్రాణహితను కచ్చితంగా నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ హయాంలోనే నిర్మించామన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను బీఆర్ఎస్ పూర్తి చేయలేదన్నారు. 


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూములపై ఆదివాసి గిరిజనులకు ఉన్న హక్కులను ధరణి ద్వారా చిన్నాభిన్నం చేశారన్నారు. ట్రైబల్ నాన్ ట్రైబల్ ప్రజల భూ సమస్యలను పరిగణలోకి తీసుకొని వారికి త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏలను బలోపేతం చేస్తూ 100% నిధులు ఇచ్చి  పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను కచ్చితంగా ఆదుకుంటామని, పంట నష్టం అంచనా వేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామనట్లు తెలిపారు. అకాల వర్షంతో కల్లాల వద్ద, ఐకెపి కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు.