RTC Bus Accident: వాగులో పడిన ఆర్టీసీ బస్సు, కండక్టర్ సహా పలువురికి గాయాలు.. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
Adilabad News Today | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ స్పందించారు.

ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. శ్యాంపూర్ వద్ద ఇరుకు వంతెన వద్ద బస్సు అదుపుతప్పి వాగులో పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీసి 108 కు ఫోన్ చేసి ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32మంది ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సు కండక్టర్ చెయ్యి విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. మరో 10 మందికి గాయాలయ్యాయి.

ఇలాంటి బ్రిడ్జిలపై నిత్యం ప్రమాదాలు..
ఇరుకు వంతెనలపై ప్రతి ఏడాది ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇదే బ్రిడ్జి వద్ద పదుల సంఖ్యలో వాహనాలు పడినప్పటికీ అధికారులు వెడల్పు వంతెనల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఉట్నూర్ ఆసిఫాబాద్ రహదారి సైతం గుంతల మయంగా మారి రెండేళ్లుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది వరకే abp దేశం ఇరుకు వంతెనలు ఉట్నూర్ ఆసిఫాబాద్ రహదారి గురించి కథనం ప్రసారం చేసింది. అప్పటికి కొంత మేర అధికారులు గుంతలు పూడ్చారు. కానీ భారీ వర్షాల కారణంగా మళ్లీ ఎక్కడిక్కడ రహదారులు గుంతల మయంగా మారాయి. ఇరుకు వంతెనలు అలాగే ఉన్నాయి. R&B శాఖ, ప్రభుత్వం ఇప్పటికైనా ఇరుకు వంతెనలు కూల్చి వెడల్పు వంతెనల ఏర్పాటుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

శ్యామ్పూర్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి జూపల్లి ఆరా
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్పూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే మంత్రి స్పందించి ఆదిలాబాద్ జిల్లా ఆదికాకారులతో మాట్లాడారు. సహాయక చర్యలు, గాయపడిన ప్రయాణికులకు అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ప్రొటెక్షన్ వాల్ లేకపోవడంతో ప్రమాదం..
ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం ఉట్నూరు మండలం శ్యామ్ పూర్ లో అసిఫాబాద్ డిపోకు చెందిన TS20T 9369 ఆర్టీసీ బస్సు బ్రిడ్జి పై నుండి కింద పడడంతో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాల పై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెల్లవారుజామున ఇరుకైన శ్యామ్ పూర్ బ్రిడ్జి పై ప్రొటెక్షన్ వాల్ లేకపోవడంతో ఘటన జరిగినట్లు ప్రాథమికంగా వెల్లడించారు.

ఘటనపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ,ఎస్పీ తో పోన్ లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ గాయపడిన క్షత్రగాతులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటన స్థలంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఆర్టీసీ అధికారులు ఆర్ఎం, డీఎంలు పర్యవేక్షిస్తున్నారు.























