Bhatti Vikramarka Padayatra: మంచిర్యాల జిల్లాలో భట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్ర 30వ రోజు కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని  ప్రేంసాగర్ రావ్ నివాసం వద్ద నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్సి, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావ్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో పాటు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా  నుండి వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మీదుగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ఎల్లంపల్లి, మురుమురు గ్రామానికి చేరుకుంటారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పూర్తవనుంది. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భట్టి పాదయాత్ర చేయనున్నారు. 


అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు 
మంచిర్యాలలో భట్టి పాదయాత్ర జోరుగా సాగుతోంది. పాదయాత్రలో పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి. అడుగడుగునా అభిమానులు భట్టిని పూల మాలలు, శాలువాలతో సత్కరించారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ పై చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యాపారులతో భట్టి విక్రమార్క ముచ్చటించారు. అనంతరం ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆపై మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను పరిశీలించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మించాల్సిన ప్రదేశంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నిర్మించడమేంటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కమీషన్ల కక్కుర్తి కోసమే మార్కెట్ ను నిర్మిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 


అప్రమత్తంగా వ్యవహరించి ఉండకుంటే ప్రాణనష్టం జరిగేది 
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ఎత్తివేసి మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని గోదావరి ముంపు ప్రాంతంలో నిర్మాణం చేయడం వల్ల గత వర్షాలకు పోటెత్తిన వరదలతో ముంపునకు గురైందని గుర్తు చేశారు. ఆరోజు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించి ఉండకుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేదన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం వరదలతో మునిగిపోతుందని గ్రహించి.. ఆసుపత్రిలో ఉన్న బాలింతలు, శిశువులను సురక్షిత ప్రాంతాలకు ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలించారని గుర్తు చేశారు. వరదలతో ఆసుపత్రి ఫస్ట్ ఫ్లోర్ ముంపునకు గురైనప్పటికీ..  ఇప్పటికీ అక్కడే ఆసుపత్రిని కొనసాగించడం దుర్మార్గమని, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఎర్పాటు చేయాలన్నారు. కమిషన్లు, కాంట్రాక్టుల బిల్లుల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దన్నారు. 


ప్రజల సంక్షేమం కోసం వెచ్చించాల్సిన నిధులను పాలకులకు భజన చేసే, జెండా మోసే వారి కోసం కేటాయించి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో షాపులు అమ్ముకోవడానికే అధికార పార్టీ నాయకులు ఐబీ చౌరస్తాలో నిర్మాణం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేయాల్సిన అనేక పనులను సొంత నిధులతో ప్రేమ్ సాగర్ రావ్ చేయడం అభినందనీయమని భట్టి అన్నారు. అలాగే మంచిర్యాలలో విద్యా వైద్యభివృద్ధి కోసం తపన పడుతున్న ప్రేమ్ సాగర్ రావ్, కరోనా సమయంలో సొంత నిధులతో మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. అలాగే బీఏ, బీఈడీ చదివిన ఉద్యోగం ఇవ్వరని, వెదురు బొంగులతో కష్టపడి తయారు చేసిన బుట్టలు, చాటలు అమ్ముకునే వృత్తికి  ప్రోత్సాహం ఇవ్వరని, ఇలా అయితే తామెలా బతకాలంటూ పాత మంచిర్యాలకు చెందిన బొల్లం రజిత.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు ఎదురొచ్చి తన గోడును వెళ్లబోసుకుంది. రోడ్డు పక్కన ఉన్నతన షాపు వద్దకు తీసుకెళ్లి తాను తయారు చేసిన బుట్టలు చూపించి అడవి నుంచి వీటిని తయారు చేసుకునే వెదురు బొంగును కూడా ఫారెస్ట్ అధికారులు తీసుకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సొసైటీలు ఉండేవని వాటి ద్వారా బొంగు సరఫరా చేసేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. 8 ఏళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూసి, ఎదురుచూసి ఉపాధ్యాయ నోటిఫికేషన్ రాకపోవడంతో కులవృత్తి చేసుకొని బతుకుతున్నాని తెలిపాతు. ఈ వృత్తికి కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదని, కనీసం బ్యాంకు నుంచి కూడా రుణాలు ఇవ్వడం లేదని వాపోయారు. డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు ఇవ్వడం లేదా అని భట్టి విక్రమార్క అడగగా... పావల వడ్డీ రావట్లేదని, ఆమె సమాధానం చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కులవృత్తులకు పెద్దపీట వేస్తామని సీఎల్పీ నేత హామీ ఇచ్చారు. బిఏ, బీఈడీ చదివి ఉద్యోగం రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.