MLC Kavitha: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యంగ్యస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేయడంపై కవిత సెటైర్లు పేల్చారు. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్లే.. రేవంత్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్‌కు కూడా వాతలే మిగులుతాయని విమర్శించారు.  రేటెంత రెడ్డి మా సీఎం కేసీఆర్ (Telangana CM KCR) పైనే పోటీకి నిలుస్తారా? అంటూ ప్రశ్నించారు. వాతలు తప్ప ఫలితం ఏమీ ఉండదని,  కర్ణాటకలో చక్కదనం లేదుగానీ అక్కడి సీఎం సిద్దరామయ్య కామారెడ్డికి వచ్చి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనను చూసి ఆ రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని ఆరోపించారు. 


శనివారం నిజామాబాద్‌లోని కేసీఆర్ కాలనీలోని న్యూ హౌసింట్ బోర్డు కాలనీ వెల్పేర్ అసోసియేషన్ హాల్‌లో జరిగిన గోసంగి కుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో గోసంగి సంఘానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కోసం పనిచేసి గెలుపుకోసం కృషి చేయాలని వారికి కవిత సూచించారు. యాదవరాజుల కాలంలో సైనికులుగా గోసంగిలు పనిచేశారని, ఈ కులానికి ఎంతో చరిత్ర ఉందని కవిత ప్రశంసించారు. మీ సమస్యలను తాను పరిష్కరిస్తానని అన్నారు.


 గోసంగి ఉనికిని సంచార జాతులవారు దెబ్బతీస్తున్నారని, ఈ సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని కవిత స్పష్టం చేశారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.  దేశంలోనే ఆడ బిడ్డలకు బీడీ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని చెప్పారు.  మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్‌తో పాటు ఉచితంగా బస్ పాస్, 104 డయాలసిస్ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చినట్లు కవిత తెలిపారు.


బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కవిత స్పష్టం చేశారు.  బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ది జరిగిందో ఆలోచించుకుని ప్రజలు ఓటేయాలని సూచించారు. ఇంతకుముందు ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది గుర్తుంచుకోవాలని కోరారు. మూడు గంటల కరెంట్ చాలదా? అంటూ రైతులను అవమానించిన రేవంత్ రెడ్డికి కొడంగల్, కామారెడ్డిలో ఓటమి తప్పదని కవిత జోస్యం చెప్పారు. కామారెడ్డిలో ఖాళీ కుర్చీలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారని, తెలంగాణలో పిక్ వేవ్ ఒక్కటే ఉందన్నారు. తప్పుడు సర్వేలతో కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుందని, అంతమాత్రాన అధికారంలోకి రారని అన్నారు.


 కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని కవిత ఎద్దేవా చేశారు.  గతంలోని కాంగ్రెస్ భయానక పాలనను ప్రజలకు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌కు రైతులు మద్దతిచ్చే అవకాశాలు లేవని, అన్ని వర్గాలు బీఆర్ఎస్ వైపే ఉన్నాయని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సిద్దరామయ్య మోసం చేశారని, కేసీఆర్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తారని కవిత తెలిపారు. బీఆర్ఎస్‌ను ప్రజలు ఆదరించాలని కోరారు.