Indravelli Martyrs Memorial: ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం
Indravelli Incident | ఆదిలాబాద్ జిల్లాలోని అడవి బిడ్డలు తమ భూమి, భుక్తి, విముక్తి కోసం గళమెత్తిన రోజు ఏప్రిల్ 20, 1981. పోలీసుల కాల్పులతో అమాయకులు బలైపోయారు.

Indravelli Martyrs Memorial | ఆదిలాబాద్ జిల్లాలోని అడవి బిడ్డలు భూమి. భుక్తి.. విముక్తి... నినాదంతో తమ హక్కుల కోసం తుడుం మోగించి పోరాడిన ఈ అడవి బిడ్డలపై ఇంద్రవెల్లిలో కురిసిన తుపాకీ గుండ్ల వర్షానికి నిలువెత్తు సాక్ష్యమే ఈ ఎరుపు రంగు స్థూపం. ఈ పోరాటంలో పోలీసుల తూటాలకు 13 మంది అమాయక అడవి బిడ్డలు అమరులయ్యారు. ఈ నెత్తుటి గాయన్ని మిగిల్చిన ఘటనకు 45 ఏండ్లు గడిచాయి.
1981 ఏప్రిల్ 20న జరిగిన ఈ సంఘటన ఆదివాసి గిరిజనుల గుండెల్లో మాత్రం అది మానని గాయంగానే మిగిలిపోయింది. మరోవైపు ఈ ఘటనకు నిదర్శనంగా నిలుస్తున్నది ఇంద్రవెల్లిలోని నిలువెత్తు అమరవీరుల స్మారక స్తూపం. ఆ దారి వెంట వచ్చిపోయే వారికి నాడు జరిగిన సంఘటనలో అమరత్వం పొందిన ఆదివాసీ గిరిజన వీరుల త్యాగాలను గుర్తుచేస్తూనే ఉన్నది.

ఆరోజు జరిగింది ఏమిటి? ఎందుకు 13 మంది అమరులయ్యారంటే..
ఆదివాసీ గిరిజనులు చట్టబద్ధమైన హక్కుల కోసం రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఆదివాసి గిరిజనులు పోరుబాట పట్టారు. దౌర్జన్యాలను ఎదిరించడం మొదలు పెట్టారు. భూ సమస్య పరిష్కారం కోసం తుడుం మోగించి పోరును మరింత ఉధృతం చేశారు. ఇందులో భాగంగా ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ రోజు సోమవారం ఇంద్రవెల్లిలో వారాంతపు సంత కూడా కావడం, మరోవైపు బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో భారీ సంఖ్యలో ఆదివాసీ గిరిజనులు తరలివచ్చారు. తొలుత సభకు అనుమతినిచ్చినా ఆ తర్వా త ఈ సభకు అనుమతి లేదని భారీగా పోలీసులను మోహరించారు. సభను అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. అయినా ఆదివాసీ గూడాల నుంచి తరలివచ్చిన అడవి బిడ్డలతో ఇంద్రవెల్లి జనసంద్రంగా మారింది. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి జనాలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పోలీసులు, ఆదివాసీలకు మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తత చోటు చేసుకోవడం.. ఓ ఆదివాసి మహిళకు ఓ పోలీసుకు మధ్య గొడవ జరగడంతో పరిస్థితి కాల్పులకు దారితీసింది. అప్పటి ఉట్నూర్ ఆర్డీవో ఆదేశాల మేరకు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది అమాయక ఆదివాసీలు చనిపోయినట్టు ప్రభుత్వ రికార్దుల్లో ఉన్నది. అయితే అంతకన్నా ఎక్కువ మందే మరణించారని పౌర హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. చాలా మంది గాయాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ అమరులకు నివాళి అర్పించడం అనవాయితీగా వస్తున్నది.
పోలీసుల కాల్పుల ఘటనలో మృతి చెందిన ఆదివాసుల స్మారకార్థం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్థూపాన్ని నిర్మించారు. కానీ ఆ స్థూపాన్ని 1986లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డైనమెట్లతో పేల్చివేశారు. దీంతో ఆదివాసులు స్థూపం కోసం చేపట్టిన ఆందోళనల ఫలితంగా మరోసారి 1987లో ఈ స్థూపాన్ని నిర్మించారు. ఇక్కడే ఏటా ఏప్రిల్ 20న అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. ఏప్రిల్ 20న ఈ ప్రాంతంలో 144 సెక్షన్ తో పాటు పలు ఆంక్షలు విధించేవారు. ఇంద్రవెల్లి నుండి గుడిహథ్నూర్, ఉట్నూర్ మార్గాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఉండేది.

ఆపై 2009 నుండి తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తరుణంలో 2010- 2014 వరకు ఆదివాసి ఉద్యమ నేతలు సిడాం శంభు, కుమ్ర ఈశ్వరిబాయి,లు ఇద్దరే ఏప్రిల్ 20 రోజున వచ్చి పోలీస్ బందోబస్తు మధ్య ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించేవారు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆంక్షలను కొంత సడలించడంతో ఆదివాసి గిరిజన సంఘాలు, ప్రతినిధులు, ఆదివాసీ గిరిజనులు ఇంద్రవెల్లి స్థూపం వద్దకు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు.
ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపంపై సీఎం ప్రత్యేక దృష్టి
ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృషి సారించారు. ముందుగా 2021లో ఆయన కరోనా లాక్ డౌన్ సమయంలో టిపిసిసి అధ్యక్షునిగా, ఎంపీగా.. అప్పటి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుతో సన్నీహితంగా ఉండి ఇంద్రవెల్లికి వచ్చి ఏప్రిల్ 20న నివాళులు అర్పించారు. ఆపై 2022లో ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా సభ ఏర్పాటు చేసి 2023లో అధికారంలోకి వచ్చి.. సీఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి ఘటనలో అమరులైన వారి కుటుంబాలకు కొంత ఓదార్పునిచ్చారు.
పోలీసుల రికార్డు ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలాలను కేటాయించారు. రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేశారు. వీరికి ఐటీడీఏ ద్వారా ట్రైకార్ రుణాలను కూడా ఇచ్చారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దేందుకు రూ.కోటి కేటాయించి పనులను ప్రారంభించారు. స్మృతి వనం పనులు పూర్తికావడంతో ఇప్పుడు ఆ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపిస్తున్నది. నేడు ఆహ్లాదకరమైన వాతావరణంలో స్మృతి వనంలో అధికారికంగా అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















