పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే మరికొంత భూమి అవసరమని అధికారులు లెక్కలు వేస్తున్నారు. పూర్తి స్థాయిలో కాలువ నిర్మాణం జరగాలంటే మాత్రం కచ్చితంగా భూసేకరణ చేయాలని అంటున్నారు. 15 వందలకుపైగా భూమి అవసరం ఉందని చెబుతున్నారు. 


పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ మధ్యే పర్యావరణ అనుమతులు వచ్చాయి. కేంద్రమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడమే మిగిలి ఉంది. మిగతా అన్ని క్లియరెన్స్‌లు ఉన్నాయి. అందుకే పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సకాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మాత్రం 15 వందల ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 


కొత్తగా చేపట్టబోయే భూసేకరణ కోసం ఎకరా భూమికి ఐదు లక్షల నుంచి 12 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీని కోసం 1500 కోట్లు ఖర్చు అవుతుందని కూడా చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రైతులకు సాగు, తాగు నీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు, 7.15 టీఎంసీల తాగు నీటి అవసరాలు తీర్చాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. 


ప్రస్తుతానికి నిర్మాణ దశలో ఉన్న కాలువలతో 11.84 లక్షల ఎకరాలకు నీరు అందివ్వాలని యోచిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వెంకటాద్రి, కురుమూర్తిరాయ, జడ్చర్ల సమీపాన ఉదండాపూర్‌ జలాశయాల కింద కాలువల నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నారు. వీటి కోసమే 1500 వందల ఎకరాలు అవసరం అవుతాయని అధికారులు అంచా వేస్తున్నారు. దీనికి సంబంధించి అంచనాలను కూడా రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. 


కురుమూర్తిరాయ జలాశయం కోసం 3,204 ఎకరాలు, వట్టెం జలాశయం కోసం 3,930 ఎకరాలు, ఉదండాపూర్‌ జలాశయం కోసం 8,411 ఎకరాలు భూసేకరణ చేపట్టాలని అధికారులు అంచనాలు తయారు చేశారు. వట్టెం, ఉద్దండాపూర్‌ జలాశయాల కింద రెండేసి కాలువలు నిర్మించనున్నారు.