భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. సూర్యాపేట‌లో ఎవ‌రికి డిపాజిట్ రాదో తేల్చుకుందాం రమ్మంటూ ఎంపీ కోమ‌టిరెడ్డికి మంత్రి కేటీఆర్ స‌వాల్ విసిరారు. ఎన్ని ఎత్తులు, కుట్రలు చేసినా సూర్యాపేటలో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి విజ‌యాన్ని ఆప‌లేరని అన్నారు. ఆయ‌న విజ‌యం ప‌క్కా ఖ‌రారై పోయిందని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట‌లో ఐటీ హ‌బ్‌ను ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.


ద‌మ్ముంటే నేరుగా కొట్లాడాలని కేటీఆర్ అన్నారు. కొంద‌రు శిఖండి రాజ‌కీయాలు, పిచ్చి ప్రయ‌త్నాలు చేస్తున్నారని.. 2000లో కేసీఆర్‌కు ఒక త‌మ్ముడిలాగా, ఉద్యమానికి ఆక‌ర్షితుడై జ‌గ‌దీశ్ రెడ్డి ఆయన వెంట న‌డిచారని గుర్తు చేశారు. ఏనాడూ ప‌ద‌వుల‌పై ఆకాంక్షతో రాలేదని అన్నారు. కేసీఆర్ మాత్ర‌మే తెలంగాణ‌కు న్యాయం చేయ‌గ‌ల‌రని.. రాష్ట్రాన్ని సాధిస్తారనే న‌మ్మ‌కంతో ఒక సైనికుడిలాగా 24 ఏళ్ల కింద‌ట కేసీఆర్‌తో క‌లిసి న‌డిచారని గుర్తు చేశారు. అలాంటిది ఇవాళ కొంద‌రు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారని అన్నారు. 


‘‘నిన్న ఒకాయ‌న అంటాడు. సూర్యాపేట‌లో డిపాజిట్ రాద‌ని.. ద‌మ్ముంటే రా తేల్చుకుందాం. ఎవ‌రికి డిపాజిట్ రాదో తేల్చుకుందాం. రాజ‌కీయాల్లో యుద్ధం నేరుగా చేయాలి.. మీరు ఏం చేశారో చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 55 ఏళ్ల కాలంలో ఏం చేశారు’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అన్ని దశాబ్దాలు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తరహాలోనే తాము కూడా చెబుతామని కేటీఆర్ చెప్పారు.


సూర్యాపేట‌లో మెడిక‌ల్ కాలేజీ ప్రారంభ‌మైందని.. పీజీ సీట్లు కూడా వ‌చ్చాయ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. సూర్యాపేట‌లో ఐటీ హ‌బ్ ప్రారంభ‌ం అయిందని తెలిపారు. క‌ల‌లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సూర్యాపేట‌ జిల్లా అయిందని.. న‌ల్గొండ పోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయిందని అన్నారు. క‌డుపు నిండా సంక్షేమం, కంటి ముందు అభివృద్ధి ఉందని.. కాబ‌ట్టి జ‌గ‌దీశ్ రెడ్డిని ఆశీర్వదించి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాల‌ని మంత్రి కేటీఆర్ కోరారు.