Dakshin Express Fire Accident: అర్ధరాత్రి రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్‌లో దక్షిణ్ ఎక్స్ ప్రెస్ రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.


అసలేం జరిగిందంటే..
దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్‌లో చేరుకున్న క్రమంలో రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో లగేజీ బోగీలు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేశారు. మంటలు చెలరేగిన బోగీని అక్కడే వదిలేసి కొంత సమయానికి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది.


ప్రాణ భయంతో ప్రయాణికుల పరుగులు
ఢిల్లీకి బయలుదేరిన దక్షిణ్ ఎక్స్ ప్రెస్‌లో అర్ధరాత్రి మంటలు చెలరేగడం కలకలం రేపింది. రైలును అధికారులు నిలిపివేసిన వెంటనే అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రయాణికులు ప్రాణ భయంతో రైలు నుంచి దూరంగా పరులు తీశారు. అయితే అగ్ని ప్రమాదం జరిగింది లగేజీ బోగీ అని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు రెస్క్యూ టీమ్, ఫైరింజన్‌కు సమాచారం అందించారు. కానీ వారు అక్కడికి చేరుకునేలోపే లగేజీ బోగీ మంటల్లో కాలి బూడిదైంది. అందులో ఉన్న లగేజీ మంటల్లో కాలిపోయింది. ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటల్ని ఆర్పివేశారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలన్నీ సాఫీగానే సాగుతున్నాయని, ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు.