Falaknuma Express Fire Accident: ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదంపై అధికారులు కేసు నమోదు చేశారు. నల్గొండ జి.ఆర్.పి స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో 5 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు రైల్వే యాక్ట్‌ సెక్షన్‌ 80/2023 కింద కేసు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. ఒక బోగీ పాక్షికంగా దగ్దమైనట్లు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి - బోమ్మాయిపల్లి స్టేషన్ల మధ్య ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. ఉన్నతాధికారులతో కలిసి ఆయన రైలు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని సందర్శించారు.






హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రయాణికుల అప్రమత్తతోనే ఘోర ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. పొగలు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు పెట్టారని, అంతలోనే రైలు ఆగిపోవడంతో హుటాహుటినా అందరు రైలు దిగి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ఒక్కో బ్యాగు మాత్రమే ఉన్న వారు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవారు వెంటనే రైలు దిగిపోగా.. ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తున్న వారు, కుటుంబంతో కలిసి ఉన్న వారి పరిస్థితి దారుణంగా మారింది. ఓ వైపు మంటలు పెరిగిపోతూ ఒక బోగీ నుంచి మరో బోగీకి వ్యాపిస్తుండగా.. కిక్కిరిసిపోయిన ప్రయాణికుల నుంచి కుటుంబసభ్యులను, లగేజీని బయటకు తీసుకువచ్చేందుకు అవస్థ పడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు బోగీలకు వ్యాపించి పూర్తిగా కాలిపోయే లోపే ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు. 


ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారంటే?


ఫలక్‌నుమా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ప్రమాదం గురించి చెబుతూ ప్రత్యక్ష సాక్షులు వణికిపోతున్నారు. ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఛార్జింగ్ పాయింట్ సమీపంలో సిగరెట్‌ తాగారని అంటున్నారు. అక్కడ సిగరెట్ కాల్చవద్దని పదే పదే అతనికి హెచ్చరించినా వినిపించుకోలేదని వివరిస్తున్నారు. దీని వల్ల ఎస్‌ 4లో మంటలు చెలరేగాయన్నారు. అవి క్షణాల్లోనే మిగిలిన మూడు బోగీల్లోకి వ్యాపించాయంటున్నారు. 


నాలుగు రోజుల క్రితమే బెదిరింపు లేఖ


దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు రోజుల క్రితం ఓ బెదిరింపు లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి ఫ్రమ్‌ అడ్రెస్ లేకుండానే వచ్చిందా లేఖ. మరో నాలుగు రోజుల్లో ఒడిశా తరహా ఘటన చూడబోతున్నారంటూ ఆగంతకులు ఆ లేఖలో హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో కూడా రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial