Bandi Sanjay Phone : పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో సంజ‌య్ పాత్ర లేక‌పోతే ఫోన్ దాచిపెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది..? ఆయ‌న ఫోన్ ఇస్తే కీల‌క స‌మాచారం బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఫోన్ ఎందుకు తేలేదు..? ఆ ఫోన్ తెస్తే అంతా బ‌య‌ట‌ప‌డుతుంది..అని వరంగల్ సీపీ రంగనాథ్ చెబుతున్నారు. బండి సంజయ్ తన ఫోన్‌ను పోలీసులకు ఇవ్వలేదని లేదని చెబుతున్నారని ఆయన అంటున్నారు. కానీ బండి సంజయ్ తన ఫోన్ ను  ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్న సమయంలో కూడా ఉపయోగించిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. మరి పోలీసులు ఆయన ఫోన్‌ను ఎందుకు తీసుకోలేదు? తీసుకుకోకుండ ఇవ్వలేదని చెబుతున్నారా? అన్న సందేహాలు వస్తున్నాయి. 


ఫోన్ కావాలనే తీసుకోలేదని..  కోర్టుల్లో అదే విషయం చెప్పి బెయిల్ రాకుండా చేసే ప్రయత్నమని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. రిమాండ్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాది బండి సంజయ్ ఫోన్ ఇంకా ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బీజేపీ నేతుల ఇదే అంశంపై ఆరోపణలు చేస్తున్నారు. బండి సంజయ్ ఫోన్ కు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా తాను ఫోన్ చేసి మాట్లాడానని బీజేపీ నేత డీకే అరుణ చెబుతున్నారు. దీంతో అసలు ఫోన్ రాజీకీయం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. 


మరో వైపు హైకోర్టులో బండి సంజయ్ రిమాండ్ రద్దు కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.  ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 7, 8, 9 మూడు రోజుల పాటు సెలవులు ఉన్నాయని బండి సంజయ్ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు వాదించడంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. పేపర్ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాక లీకేజ్ ఎలా అవుతుందని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఓ పొలిటిషియన్ గా బండి సంజయ్ కు ప్రశ్న పత్రం వస్తే.. దానికే ఆయనను దోషిగా ఎలా పరిగణిస్తారంటూ కోర్టు ప్రశ్నించింది. 


ఓ ప్రతిపక్ష నేతగా బండి సంజయ్ కు ప్రభుత్వ తప్పులను చెప్పే బాధ్యత ఉందన్న కోర్టు.. అయిన చాలా మందికి పేపర్ వెళ్లిన తర్వాతే బండి సంజయ్ కి  వచ్చిందని తెలిపింది. A1 గా బండి సంజయ్ పై మోపిన ఆరోపణలకు ఆధారాలేమైనా ఉన్నాయా అని నిలదీసింది. ఆ తర్వాత బండి సంజయ్ కు బెయిల్ పిటిషన్ వేసుకునే స్వేచ్ఛ ఉందంటూ కోర్టు స్పష్టం చేసింది. సంజయ్ పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని  పిటిషనర్ల తరపు లాయర్ ఆరోపించారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ హాజరవ్వాలని, వరంగల్ కోర్టులో దాఖలైన  బెయిల్ పిటిషన్ పై ఈ రోజే నిర్ణయం తీసుకునేలా కింది కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. వరంగల్ లోయర్ కోర్టులో బండి సంజయ్ బెయిల్ పిటిషన్  ప్రస్తుతం పెండింగ్ ఉండగా.... ఒకవేళ దాన్ని డిస్మిస్ చేస్తే.. హైకోర్టులో హౌస్ మోషన్ కింద బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.