Minister Jagadish Reddy : మునుగోడు ఉపఎన్నిక ప్రజల అవసరం కోసం వచ్చిన ఎన్నిక కాదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నిక ఒక వ్యక్తి స్వార్థం కోసం, ఒక పార్టీ కుట్రలో భాగంగా వచ్చిందని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి తన, తన కుటుంబ స్వార్థం కోసం ప్రజల నమ్మకాన్ని అమ్ముకున్నారని విమర్శించారు. మూడేళ్లుగా టచ్ లో ఉన్నా, తనకు ఆరు నెలల క్రితం టెండర్ వచ్చిందని రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని తెలిపారు. బహిరంగంగా అమ్ముడు పోయిన, దొరికిపోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. అమ్ముడుపోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే నైతిక అర్హత లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాలు చేస్తూ మేము త్యాగాలు చేసినం అనే మాటలు ఎందుకని ఎద్దేవా చేశారు. పైసలు పెట్టి ఏ దుర్మార్గమైనా చేస్తా అనడం, పూటకో మాట ఊరుకో అబద్ధం చెప్పడం కోమటిరెడ్డి బ్రదర్స్ నైజమన్నారు. 


రాజగోపాల్ రెడ్డి కోవర్టు 


"అభివృద్ధి కోసం రాజీనామా చేశానంటున్న రాజగోపాల్ రెడ్డిని ఎట్లా అభివృద్ధి చేస్తారో ప్రజలు అడుగుతుర్రు. ప్రజలకు ఉన్న ఇంగితజ్ఞానం రాజగోపాల్ రెడ్డికి లేదు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని కాదని ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో చేరారు. కేసీఆర్ కు జాతీయస్థాయిలో వస్తున్న ఆదరణ చూసి కుట్రతో తెచ్చిన ఎన్నిక మునుగోడు. మూడేళ్లు నుంచి కాంగ్రెస్ కు నష్టం కలిగిస్తూ బీజేపీకి లాభం కలిగిస్తూనే ఉన్న అని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి కోవర్టుగా బీజేపీకి పనిచేసినా అని బహిరంగంగా ఒప్పుకున్నాడు. బీజేపీకి ఓటు వేస్తే విద్యుత్ చట్టాలు అమలు అవుతాయి. మోటార్లకు మీటర్లు వస్తాయి. మునుగోడులో టీఆరెస్ అభ్యర్థి గెలిస్తే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మూడున్నర ఏళ్లలో మునుగోడు అభివృద్ధి కుంటుపడింది."-జగదీష్ రెడ్డి 


కాంగ్రెస్ బలంగానే ఉంది


 మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి  జిల్లా మంత్రిగా ఉన్న తనను, ముఖ్యమంత్రిని ఎప్పుడైనా కలిశారా? అని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. అమ్ముడుపోయిన తరువాత అభివృద్ధి మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు.  మునుగోడులో జరిగే ధర్మయుద్ధంలో ధర్మం వైపే  ప్రజలు ఉంటారన్నారు. మునుగోడులో బీజేపీ కి గత ఎన్నికల్లో 12 వేల ఓట్లు వచ్చాయన్నారు. ఇప్పటికైతే మునుగోడులో కాంగ్రెస్ బలంగా ఉందని, మాకు పోటీ కాంగ్రెస్ పార్టీనే అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వలోపం ఉందని తెలిపారు. నాగార్జున సాగర్, హుజుర్ నగర్ లో ఎట్లా అయితే డోకా లేదో ఇప్పుడు కూడా ఉండదన్నారు. నల్గొండ జిల్లాలో  మూడో ఉపఎన్నికను కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టి తిరుతామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక టీఆరెస్ పార్టీ నుంచే తమ అభ్యర్థి బరిలో దిగుతారని స్పష్టం చేశారు.  


Also Read : Minister Vemula Prashanth Reddy : బొగ్గుగని కాంట్రాక్ట్ ఆశచూపి రాజీనామా, రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే ఉపఎన్నిక - మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి