Moinabad Issue: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు రిమాండ్‌ విధించడంపై నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నిందితులు వేసిన పిటిషన్ విచారించిన సర్వోన్నత న్యాయస్థానం... వారిపై సీరియస్ అయ్యింది. రాజకీయాలకు కోర్టులను వేదికలుగా చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. విచారణ జరిపిన జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం.. దర్యాప్తుపై స్టే విధించాలని ఓ పార్టీ వేసిన పిటిషన్‌ను విచారణకు హైకోర్టు ఎలా స్వీకరించిందని ప్రశ్నించింది. పిటిషన్‌ దాఖలుకు ఆ పార్టీకి ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించాల్సిందని అభిప్రాయపడింది.


టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌లు హైకోర్టులో ఉన్నాయని.. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. బీజేపీ తరపున కర్ణాటక మాజీ ఏజీ వాదనలు వినిపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇదంతా పక్కా ప్లాన్ తో చేసిందన్నారు. పోలీసులు ఈ కేసును పారదర్శకంగా చెయ్యడం లేదన్నారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు, ప్రవర్తించిన తీరు పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. మీడియాకు ముందే సమాచారం ఇచ్చారని అన్నారు. అన్ని ప్రసార మధ్యమాల్లో ఈ వార్త ప్రచురితమైందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా ఒక డ్రామా లాగా ఉంది అని అన్నారు. పోలీస్ కమిషనర్ స్పాట్ లోనే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చెయ్యకుండా కోట్ల రూపాయలు డబ్బులు ప్రలోబాలు చూపారని చెప్పారు.


ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం కోర్టు.. ఈ కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. 


అసలేం జరిగిందంటే..?


టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుయత్నం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు జైలుకు తరలించారు. 26వ తేదీన ఈ కేసు వెలుగులోకి రాగా.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 41-ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదంటూ రిమాండ్ ను మొదట ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని న్యా/మూర్తి ఆదేశాలు జారీ చేశారు. లేదా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని న్యాయమూర్తి ఆదేశారు ఇచ్చారు. మరోవైపు బీజేపీ నేతలు.. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు తమకు నమ్మకం లేదని సీబీఐకి కేసు అప్పగించాంటూ దాఖలు చేసిన పిటిషన్ పై మరో న్యాయమూర్తి విచారణ జరిపారు. దర్యాప్తును వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  


నిందితులకు 14 రోజుల రిమాండ్ 


హైకోర్టు ఆదేశాలతో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్ ను పోలీసులు శనివారం రెండోసారి అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరచగా.. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. 41-ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదటూ ఏసీబీ కోర్టు రిమాండ్ ను తిరస్కరించడంతో... హైకోర్టును ఆశ్రయించి పోలీసులు అనుమతి పొందారు. ఈ క్రమంలోనే నిందితులు ఫిల్మ్ గనర్ షేక్ పేట దారిలో ఉన్న నందకుమార్ నివాసమైన ఆదిత్య హిల్ టాప్ లో ఉన్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. అక్కడకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు వెళ్లగా.. గమనించిన నందకుమార్ లిఫ్టును నిలిపివేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఎనిమిదో అంతస్తు వరకు మెట్లు ఎక్కుతూ వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నందకుమార్ తో పాటు సింహయాజి, రామ చంద్ర భారతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచగా నిందితులకు రిమాండ్ విధించారు. విచారణలో భాగంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలతో వీరికి ఉన్న సన్నిహిత సంబందాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.